కొంపముంచిన పవర్ ప్లే..
‘బౌలింగ్, బ్యాటింగ్లోనూ పవర్ ప్లే మా కొంపముంచింది. మేం బేసిక్ తప్పిదాలు చేశాం. అంతర్జాతీయ క్రికెట్లో ఇలాంటి తప్పిదాలు అస్సలు చేయకూడదు. మంచి, చెడు రోజు ఉండటం సాధారణమే అయినా బెసిక్స్ మరిచిపోకూడదు. ఈ పరిస్థితులు అర్ష్దీప్కు చాలా కఠినంగా ఉంటాయి. అతన్ని నిందించడం లేదు. కానీ అతను గతంలో కూడా ఇలానే నో బాల్స్ వేసాడు. ఈ ఓటమిని అతను జీర్ణించుకోలేడు. ఏ ఫార్మాట్లోనైనా నోబాల్స్ వేయడం నేరం అనే విషయం అందరికి తెలుసు.
అందుకే రాహుల్ మూడో స్థానంలో..
జట్టులోకి వచ్చే కొత్త ప్లేయర్కు సౌకర్యంగా ఆడే అవకాశం ఇవ్వడం జట్టు ఆనవాయితీ. రాహుల్ త్రిపాఠి మూడో నంబర్లో అద్భుతంగా ఆడగలడు. అందుకే అతన్ని ఆ స్థానంలో బరిలోకి దింపాం. నాలుగో స్థానంలో సూర్య తనదైన శైలిలో చెలరేగాడు'అని హార్దిక్ పాండ్యా చెప్పుకొచ్చాడు. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 206 పరుగులు చేసింది. కెప్టెన్ డసన్ షనక(22 బంతుల్లో 2 ఫోర్లు, 6 సిక్స్లతో 56 నాటౌట్) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడగా.. ఓపెనర్లు కుశాల్ మెండీస్(52), పాతుమ్ నిస్సంక(33) అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. భారత బౌలర్లలో ఉమ్రాన్ మాలిక్(3/48) మూడు వికెట్లు తీయగా.. అక్షర్ పటేల్(2/24) రెండు వికెట్లు పడగొట్టాడు. యుజ్వేంద్ర చాహల్ ఓ వికెట్ తీసాడు.
కొంపముంచిన నోబాల్స్..
అనంతరం భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 190 పరుగులు చేసింది. అక్షర్ పటేల్(31 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్స్లతో 65), సూర్యకుమార్ యాదవ్(36 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్లతో 51)ల పోరాటం వృథా అయ్యింది. చివర్లో శివమ్ మావి(15 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లతో 26) రాణించాడు. ఇక భారత బౌలర్లు 7 నోబాల్స్ వేయడం ఓటమిని శాసించింది. ఈ నో బాల్స్ ద్వారా శ్రీలంక అదనంగా 36 పరుగులు చేసింది. ఇందులో అర్ష్దీప్ సింగ్ ఒక్కడే 5 నోబాల్స్ వేసాడు. ఈ అనవసర పరుగులే టీమిండియా ఓటమిని శాసించాయి.