భారత్పై విద్వేషం..
కరోనా కారణంగా ఇబ్బంది పడుతున్న అభాగ్యులకు అఫ్రిది తన ఫౌండేషన్ ద్వారా నిత్యవసర సరకులు అందజేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పాక్ ఆక్రమిత కశ్మీర్లో పర్యటించిన ఈ పాక్ మాజీ కెప్టెన్ అక్కడి స్థానికులతో మాట్లాడూతు భారత్పై తనకున్న విద్వేషాన్ని చాటుకున్నాడు. దానికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఈ వీడియోలో అఫ్రిది మాట్లాడుతూ.. ఆర్టికల్ 370 రద్దు చేయడాన్ని ఉద్దేశించి ప్రధాని మోదీ, భారత ప్రభుత్వంపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు.
భారత కశ్మీరీలు కూడా..
పాకిస్థాన్ సైనిక బలం 7 లక్షలు కాగా.. అంతమంది భారత సైనికులను మోదీ కేవలం కశ్మీర్లోనే మోహరించారు. మీ అందమైన గ్రామంలోకి రావడం చాలా సంతోషంగా ఉంది. చాలా కాలం నుంచి మీ అందరిని కలవాలనుకుంటున్నా. ప్రపంచం కరోనా అనే మహమ్మారితో పోరాడుతుంది. కానీ నరేంద్ర మోదీ మనస్సులో దానికి మించిన వ్యాధి ఉంది' అని వ్యాఖ్యానించాడు. భారత కశ్మీర్లు కూడా పాక్ ఆర్మీకే మద్దతు ఇస్తున్నారనీ తెలిపాడు. అఫ్రిది డైలాగ్లకు పాక్ సైనికులు చప్పట్లు కొట్టారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది.
అఫ్రిది కామెంట్స్ బాధించాయి..
అఫ్రిది చేసిన వ్యాఖ్యలు తనను బాధించాయని, అవి ఏమాత్రం ఆహ్వానించదగినవు కావని హర్భజన్ ఇండియా టూడేతో మాట్లాడుతూ అన్నాడు. ‘‘మా దేశం గురించి, ప్రధాని గురించి అఫ్రిది చేసిన వ్యాఖ్యలు బాధించాయి. అతని కామెంట్స్ను తీవ్రంగా ఖండిస్తున్నా. అవి ఏమాత్రం ఆహ్వానించదగినవు కావు. అతను మా సహాయం కోరినప్పుడు మేము ఏదీ ఆలోచించకుండా ముందుకు వచ్చాము. మానవత్వంతో స్పందించాం. కరోనా వైరస్తో ఇబ్బంది పడుతున్నవారికి సాయం చేయాలని అలా చేశాం.
మా ప్రధాని కూడా కరోనా వైరస్కి దేశం, కులం, మతం ఏదీ లేదని చెప్పారు. కాబట్టి మేము సంక్షోభాన్ని అధిగమించేందుకే పని చేస్తున్నాం. ఈ సంక్షోభంలో మా వంతు సహాయాన్ని మేము అందిస్తాము. కానీ ఈ మనిషి(అఫ్రిది) మా దేశం గురించి మాట్లాడుతున్నాడు. ఇప్పుడే చెబుతున్నా.. అతనితో మాకెలాంటి సంబంధం లేదు. మా దేశానికి వ్యతిరేకంగా మాట్లాడే హక్కు అతనికి ఏ మాత్రం లేదు. అతను తన హద్దుల్లో తన దేశంలో ఉంటే బాగుంటుంది' అని భజ్జీ ఫైర్ అయ్యాడు.
తుపాకీతో నేనే ముందుంటా..
ఇక తన దేశభక్తి చాటుకోవాల్సిన అవసరం లేదని ఈ సీనియర్ స్పిన్నర్ తెలిపాడు. ‘నేను ఈ దేశంలోనే పుట్టా.. ఈ దేశంలోనే చస్తా. 20 ఏళ్లు దేశం తరఫున ఎన్నో మ్యాచ్లు ఆడా. దేశానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నానని ఏ రోజు ఏ ఒక్కరు నన్ను అనలేదు. దేశ రక్షణ కోసం ఎప్పుడు సిద్దం. అవసరమైతే తుపాకీ పట్టుకొని బార్డర్లో యుద్దం చేయమంటే నేనే ముందుంటా'అని భజ్జీ చెప్పుకొచ్చాడు.
ఇక అఫ్రిది ఫౌండేషన్కు విరాళాలు ఇవ్వాలని హర్భజన్, యువరాజ్ భారత అభిమానులను కోరి విమర్శలపాలయ్యారు. అఫ్రిది తాజా వ్యాఖ్యలతో భారత నెటిజన్లు వీరిపై మరోసారి మండిపడుతున్నారు. ఇక అఫ్రిది వ్యాఖ్యలపై టీమిండియా మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ కూడా స్పందించాడు. బిచ్చగాళ్లు అంటూ మండిపడ్డాడు.