ఆ క్షణమే మంచి భవిష్యత్తు ఉంటుందని..
పదేళ్లపాటు ముంబై ఇండియన్స్కు ఆడిన హర్భజన్.. గత రెండేళ్లు చెన్నై సూపర్ కింగ్స్కు ఆడాడు. వ్యక్తిగత కారణాలతో ఈ సీజన్ నుంచి తప్పుకున్నాడు. అయితే మరో 5 రోజుల్లో ఈ క్యాష్ రిచ్ లీగ్కు తెరలేవనుండగా.. భజ్జీ స్టార్ స్పోర్ట్స్ ‘ఐపీఎల్ మొమోరిస్'అనే కార్యక్రమంలో విరాట్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్ ఆరంభ సీజన్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్లో కోహ్లీ.. శ్రీలంక దిగ్గజం సనత్ జయసూర్య బౌలింగ్లో సిక్స్ కొట్టాడని గుర్తు చేసుకున్నాడు. ఆక్షణమే విరాట్ ప్రపంచస్థాయి బ్యాట్స్మెన్ అవుతాడనుకున్నానని తెలిపాడు.
కొంచెం కూడా భయపడలేదు..
‘ఐపీఎల్ ఆరంభ సీజన్ వేలానికి ముందు విరాట్ కోహ్లీ పేరుని మాజీ క్రికెటర్ లాల్చంద్ రాజ్పుత్ ద్వారా విన్నాను. ఆ ఏడాది బెంగళూరు, ముంబై మధ్య మ్యాచ్ జరగగా.. కెప్టెన్ సచిన్ టెండూల్కర్ ఆ మ్యాచ్కి దూరమయ్యాడు. బెంచ్కే పరిమితమయ్యాడు. దాంతో నేను ముంబై ఇండియన్స్ కెప్టెన్గా నేను వ్యవహరించాను. మ్యాచ్ మధ్యలో సనత్ జయసూర్య బౌలింగ్కు రాగా.. విరాట్ కోహ్లీ క్రీజు వెలుపలికి వచ్చి మరీ సిక్స్ బాదేశాడు. ఆ టైమ్లో కోహ్లీ తనకి బౌలింగ్ చేస్తోంది గొప్ప ఆటగాడనే విషయాన్ని పట్టించుకోలేదు. అతనిలో ఆ భయం కొంచె కూడా కనిపించలేదు. కోహ్లీకి మంచి భవిష్యత్ ఉంటుందని అప్పుడే ఊహించా.' అని హర్భజన్ సింగ్ వెల్లడించాడు.
అదే విరాట్ సక్సెస్కు కారణం..
ఇక ఇదే షోలో పాల్గొన్న మరో ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ కూడా ఐపీఎల్లో విరాట్ కోహ్లీ ప్రారంభ రోజులను గుర్తు చేసుకున్నాడు. అతన్ని చూసిన తర్వాతే ఓ బ్యాట్స్మన్ ఆట పట్ల ఎంత ఫోకస్గా ఉంటాడో తెలిసిందన్నాడు. ‘ఐపీఎల్లో విరాట్ చూసినప్పుడల్లా నాకు అతనొక్కడే కనిపించేవాడు. ఫీల్డ్లో ఆఫ్ ది ఫీల్డ్లో ఒకే విధంగా ఉంటాడు. ఆటను ఆ విధంగానే ఆస్వాదిస్తాడు. కానీ ఏనాడు క్రికెట్ను నిర్లక్ష్యం చేయలేదు. ఎప్పుడూ క్రికెట్పై ఫోకస్ పెడ్తాడు. అదే అతన్ని ప్రపంచ నెంబర్ వన్ బ్యాట్స్మన్గా నిలబెట్టింది. ఆట పట్ల అతని కమిట్మెంట్ తెలియజేసింది.'అని పఠాన్ చెప్పుకొచ్చాడు.
టాప్ స్కోరర్ కోహ్లీ..
ఐపీఎల్లో ఇప్పటి వరకూ 12 సీజన్లు ముగియగా.. 177 మ్యాచ్లాడిన విరాట్ కోహ్లీ 5,412 పరుగులతో టాప్ స్కోరర్గా కొనసాగుతున్నాడు. ఇందులో ఐదు సెంచరీలు ఉండగా.. 36 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. కానీ.. అతను కెప్టెన్సీ వహిస్తున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాత్రం ఇప్పటి వరకూ ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేదు. ఈ సారి టైటిలే లక్ష్యంగా బరిలోకి దిగుతుంది. సెప్టెంబర్ 21న సన్ రైజర్స్ హైదరాబాద్తో జరిగే మ్యాచ్తో ఐపీఎల్ 2020 సీజన్ను ప్రారంభించనుంది.