ఓ పద్దతి.. ఓ క్లారిటీ..
రెండు టెస్ట్ల సిరీస్లో భాగంగా న్యూజిలాండ్తో శుక్రవారం ప్రారంభంకానున్న తొలి టెస్ట్ నేపథ్యంలో టైమ్స్ ఆఫ్ ఇండియాకు రాసిన కాలమ్లో శుభ్మన్పై గంభీర్ ప్రశంసల జల్లు కురిపించాడు.
‘మయాంక్ అగర్వాల్పై నాకు పూర్తి విశ్వాసం ఉంది. భారత జట్టులో అతనేం విధ్వంసకర ఆటగాడు కాకపోవచ్చు. డాషింగ్ ఓపెనర్లు వీరేంద్ర సెహ్వాగ్, డేవిడ్ వార్నర్ తరహాలో అతని బ్యాటింగ్ ఉండకపోవచ్చు. కానీ ఓపెనర్గా అతనికో క్లారిటీ ఉంది. బ్యాటింగ్లో ఒక పద్ధతి ఉంది. అతని ఆలోచనలపై ఓ స్పష్టత ఉంది. అదే అతని బలం.'అని గంభీర్ తెలిపాడు.
పక్కా నయా జోడీ..
న్యూజిలాండ్తో టెస్టు సిరీస్లో మయాంక్తో కలిసి పృథ్వీ షా, శుభ్మన్ గిల్ల్లో ఎవరు ఓపెనింగ్ చేస్తారో చూడాలని ఉందన్నాడు. ‘ఈ సిరీస్లో ఇన్నింగ్స్ ప్రారంభించే జోడీ భారత్కు కొత్త ఓపెనింగ్ జోడీ కానుంది. మయాంక్తో ఇన్నింగ్స్ ప్రారంభించడానికి పృథ్వీషా, శుభ్మన్లలో ఎవరు అవకాశం దక్కించుకుంటారో? ఎలా ఆడుతారోనని ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నాను.'అని గంభీర్ చెప్పుకొచ్చాడు.
ఇక్కడ షా సహజసిద్ధమైన ఓపెనర్ అయితే, ఈ స్థానంలో గిల్ ఫిట్ కావడం కోసం యత్నిస్తున్నాడని గంభీర్ తెలిపాడు. తన దృష్టిలో ఇన్నింగ్స్ను ఆరంభించడం పెద్ద సమస్య కాదన్నాడు. కాకపోతే ఆరంభంలోనే రెండు వికెట్లు కోల్పోయి నాల్గో నంబర్లో బ్యాటింగ్ చేయాల్సి వస్తే అది చాలెంజింగ్గా ఉంటుందన్నాడు. అప్పుడే అసలు సిసలైన ఒత్తిడి నెలకొంటుందన్నాడు.
మాకు పోటీలేదు..
ఓపెనింగ్ స్థానం కోసం తన సహచర ఆటగాడు పృథ్వీ షాతో పోటీపై శుభ్మన్ గిల్ను ఇటీవల ప్రశ్నించగా.. తనదైన శైలిలో బదులిచ్చాడు. ‘పృథ్వీ షాతో నాకెలాంటి పోటీలేదు. మా ఇద్దరిలో ఎవరికి అవకాశం వచ్చినా జట్టు కోసమే ఆడతాం. ఒకరితో ఒకరు పోటీ పడటం కోసం ఇక్కడి రాలేదు. వచ్చిన అవకాశాల్ని నిలబెట్టుకోవడం కోసమే వచ్చాం. తుది జట్టులో ఎవరు ఉండాలనేది మా సమస్య కాదు. అది మేనేజ్మెంట్ తలనొప్పి.
మా ఇద్దరి కెరీర్ ఒకేసారి ప్రారంభమైంది. అంత మాత్రాన మా మధ్య పోరు అనేది ఎప్పుడూ చోటు చేసుకోలేదు.. చోటు చేసుకోదు కూడా. ఇప్పటివరకూ మాకు దక్కిన అవకాశాల్లో మెరుగైన ప్రదర్శన ఇవ్వడంతోనే ఇంతవరకూ వచ్చాం. భారత సీనియర్ జట్టు తరఫున ఎవరు ఆడతారు అనేది మేనేజ్మెంట్ చూసుకుంటుంది. ఎవరికి అవకాశం వచ్చినా అది వృథా కాకుండా ఆడటమే మా ముందున్న లక్ష్యం' అని గిల్ చెప్పుకొచ్చాడు.
పృథ్వీనే కోహ్లీ హింట్..
టెస్ట్ జట్టులో శుభమన్ గిల్, మయాంక్, పృథ్వీషా ముగ్గురు ఓపెనర్లు అందుబాటు ఉండటం.. సూపర్ ఫామ్లో ఉన్న కేఎల్ రాహుల్ జట్టులో లేకపోవడం.. అనాధికారిక టెస్టుల్లో శుభమన్ మెరుపులు మెరిపించడంతో ఏ జోడీ ఇన్నింగ్స్ ప్రారంభిస్తుందనేదానిపై విశ్లేషణలు జోరు అందుకున్నాయి. మయాంక్ అగర్వాల్తో కలిసి పృథ్వీ షా బరిలోకి దిగుతాడా.. లేక మయాంక్-శుభ్మన్ గిల్ ఇన్నింగ్స్ను ఆరంభిస్తారా అనే దానిపై స్పష్టత లేకపోయింది. దీంతో కివీస్తో జరగనున్న తొలి టెస్టులో మయాంక్కు జతగా ఆడేదెవరో అనే సందేహం ఉండగా.. కోహ్లీ తాజా ఇంటర్వ్యూలో ఓ స్పష్టత ఇచ్చాడు.
'పృథ్వీ షాకి ఎంతో ప్రతిభ ఉంది. అతడు తన ఆటను అలానే కొనసాగించాలని అందరం ఆశిస్తున్నాం. తన ప్రదర్శనపై షా ఎప్పుడూ నిరాశ చెందడు. మయాంక్ ఆసీస్లో రాణించనట్లుగానే.. పృథ్వీ న్యూజిలాండ్లో రాణిస్తాడని నమ్ముతున్నా. భయం లేకుండా ఆడే చాలా మంది క్రికెటర్లు ఉండటం జట్టుకు మరింత ప్రేరణగా నిలుస్తుంది. పృథ్వీ, మయాంక్కు అనుభవం లేదని అంటున్నారు. మయాంక్ గత ఏడాదిలో ఎన్నో పరుగులు చేసాడు. అతడు టెస్టు క్రికెట్ను ఎంతో అర్థం చేసుకున్నాడు' అని అన్నాడు. కోహ్లీ మాటలను బట్టి చూస్తే మయాంక్కు జతగా షా బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది.