హైదరాబాద్: గాడియం స్పోర్టోపియా క్రికెట్ అకాడమీ వ్యాపారం కోసం కాదు. యువ క్రికెట్ ప్రతిభను మెరుగుపరిచే లక్ష్యంతోనే ఆ సంస్థతో చేతులు కలిపినట్లు భారత స్టార్ స్పిన్నర్, జెన్నెక్ట్స్ క్రికెట్ ఇన్స్టిట్యూట్ మెంటార్ రవిచంద్రన్ అశ్విన్ చెప్పారు. హైదరాబాద్ నగరంలోని గాడియం స్పోర్ట్స్ స్కూల్లో నూతనంగా ఏర్పాటు చేసిన క్రికెట్ అకాడమీని అశ్విన్ బుధవారం ప్రారంభించారు. గాడియం స్పోర్టోపియా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో కూడిన సొంత క్రికెట్ అకాడమీని ఏర్పాటు చేసింది. దీనికోసం భారత క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్కు చెందిన జెన్-నెక్ట్స్ క్రికెట్ ఇన్స్టిట్యూట్తో గాడియం జతకట్టింది.
'టెస్టు క్రికెట్ చనిపోకూడదు.. సుదీర్ఘ ఫార్మాట్ కోసం సరైన ప్రణాళికలు చేయాలి'
బుధవారం అకాడమీ ప్రారంభ ఉత్సవం అనంతరం అశ్విన్ అక్కడి విద్యార్థులతో కలిసి సందడి చేశాడు. ఎగ్జిబిషన్ క్రికెట్ మ్యాచ్ ఆడి విద్యార్థులకు క్రికెట్ మెళకువలు నేర్పించాడు. ఆపై అశ్విన్ మాట్లాడుతూ... 'చిన్నారులకు అద్భుతమైన మౌలిక వసతులతో పాటు సరికొత్త పద్ధతిలో శిక్షణ అందిస్తే భవిష్యత్లో వారు నాణ్యమైన క్రికెటర్లుగా ఎదుగుతారు. గాడియం ప్రపంచ ప్రమాణాలకు తగినట్లుగా అకాడమీని ఏర్పాటు చేసింది. పుల్లెల గోపీచంద్, ఎస్.రామన్, ఆర్బీ రమేశ్ లాంటి దిగ్గజ క్రీడాకారులు భాగస్వాములై ఉన్న స్పోర్టోపియాతో కలవడం తనకు గొప్ప అవకాశం' అని అన్నారు.
బ్యాడ్మింటన్, చెస్, టేబుల్ టెన్నిస్, బాస్కెట్బాల్, రోలర్ స్కేటింగ్ క్రీడల్లో అకాడమీలు ఏర్పాటు చేసి విద్యార్థుల్ని క్రీడల వైపు మళ్లిస్తోన్న గాడియం జాబితాలో క్రికెట్ను కూడా జతచేసిందని స్పోర్టోపియా వ్యవస్థాపకురాలు, డైరెక్టర్ కీర్తి రెడ్డి అన్నారు. అంకిత భావం, పట్టుదల కలిగిన అశ్విన్ లాంటి స్టార్తో ఒప్పం దం కుదుర్చుకోవడం గౌరవంగా భావిస్తున్నాం. 2020 నాటికి 180 కోట్ల బడ్జెట్తో 25 స్పోర్ట్స్ అకాడమీల ఏర్పాటే లక్ష్యంగా పని చేస్తున్నామని ఆమె చెప్పారు.
ఐసీసీ ప్రమాణాలకు అనుగుణంగా ఏర్పాటు చేసిన ఈ అకాడమీలోని మైదానం ఫిరోజ్షా కోట్లా గ్రౌండ్కు మించిన వైశాల్యంతో ఉంటుందని సమాచారం. ప్రాక్టీస్ కోసం 12 నెట్లతో పాటు 3 టర్ఫ్, 3 ఆస్ట్రో, 3 మ్యాటింగ్, 3 సిమెంట్ వికెట్లను ఇందులో ఏర్పాటు చేయనున్నారు. వీటితో పాటు మూడు ఇండోర్ నెట్లు, 2 బౌలింగ్ మెషీన్లు అందుబాటులోకి రానున్నాయి. ఒకేసారి వెయ్యి మంది మ్యాచ్ల్ని చూసేందుకు వీలుగా సీట్లను అమర్చారట.