ప్రస్తుతం టీమిండియా వైట్ బాల్ క్రికెట్లో అత్యంత చెత్త ఫామ్లో ఉన్న ఆటగాడు ఎవరైనా ఉన్నాడంటే అతను వికెట్ కీపర్ రిషభ్ పంత్. కోహ్లీ, రోహిత్ వంటి ఆటగాళ్లు ఫామ్లో లేకపోయినా ఇంత ఛండాలంగా ఆడటం ఎన్నడూ చూడలేదు. అనవసరమైన షాట్లకు ప్రయత్నించడం, ఒకే తరహా వృధా షాట్లు ఆడుతూ అవుటవడం పంత్ అలవాటు చేసుకున్నాడు. అదే సమయంలో ఇషాన్ కిషన్, సంజూ శాంసన్ వంటి యువకులు టీమిండియాలో చోటు కోసం వెయిట్ చేయాల్సి వస్తోంది.
ఈ క్రమంలోనే పంత్ను పరిమిత ఓవర్ల క్రికెట్లో పక్కన పెట్టేయాలని మాజీ స్పిన్నర్ లక్ష్మణ్ శివరామకృష్ణన్ అన్నాడు. 'పంత్ తన కీపింగ్ నైపుణ్యాన్ని బాగా మెరుగు పరుచుకున్నాడు. కానీ బ్యాటింగ్ విషయంలో విఫలమయ్యాడు. అందుకే నేనైతే పంత్ను వైట్ బాల్ క్రికెట్లో పక్కన పెట్టేస్తా. రంజీ ట్రోఫీలో ఆడిస్తా. ఆ తర్వాత వచ్చి బంగ్లాతో రెండు టెస్టులు ఆడొచ్చు. రంజీలు ఆడటం పెద్ద తప్పేం కాదు కదా. అక్కడ అతనికి తిరిగి ఫామ్ అందుకునే సమయం దక్కుతుంది' అని వివరించాడు.
టెస్టు క్రికెట్లో అద్భుతమైన బ్యాటర్గా పేరొందిన పంత్.. పరిమిత ఓవర్ల క్రికెట్లో పెద్దగా ఆకట్టుకోలేదు. ఈ ఏడాది ఆరంభంలో ఇంగ్లండ్తో జరిగిన వన్డేలో తొలి సెంచరీ చేశాడు. కానీ ఆ తర్వాత మళ్లీ షరా మామూలే. అనవసర షాట్లకు ప్రయత్నించి వికెట్ పారేసుకుంటున్నాడు. ఇధే విషయాన్ని చెప్పిన శివరామకృష్ణన్. 'పంత్ బలమైన షాట్లు ఆడి తన ఫామ్ తిరిగి పొందాలని అనుకుంటున్నాడు. అది కరెక్ట్ కాదు. ఎవరూ కూడా చెత్త షాట్లు ఆడి ఫామ్లోకి రాలేరు. పంత్ మంచి బంతులకు అవుటవుతుంటే పర్లేదు. కానీ చెత్త బంతులను అనవసరమైన షాట్లు ఆడి అవుట్ అవడం వృధా' అని చెప్పాడు.