మెల్బోర్న్: కరోనా వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఆటలన్నీ ఆగమాగమయ్యాయి. ఈ మహమ్మారి దెబ్బకు టోక్యో ఒలింపిక్సే వాయిదా వేయాల్సిన పరిస్థితి రాగా.. ఐపీఎల్ పూర్తిగా రద్దయ్యేలా ఉంది.
తాజాగా ఈ జాబితాలోకి ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ కూడా చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈనెల 29న ఈ టోర్నీ నిర్వాహణపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది.
వాస్తవానికి ఈ టోర్నీని అక్టోబర్ 18 నుంచి ఆస్ట్రేలియా వేదికగా జరగాల్సి ఉంది. కానీ ప్రస్తుతం కరోనా వైరస్ ఆసీస్లో విలయతాండవం చేస్తుంది. ఇప్పటికే రెండు వేల మందికి పైగా ఈ వ్యాధి బారిన పడ్డారు. దీంతో ఆ దేశం ఈ మహమ్మారి వ్యాప్తిని అడ్డుకునేందుకు లాక్డౌన్ ప్రకటించింది.
ఓ కోహ్లీ ఒక కోటి ఇవ్వరాదు.. కోట్ల ఆదాయం ఉన్న క్రికెటర్లు విరాళలు ప్రకటించరే?
ఇందులో భాగంగా తమ దేశ సరిహద్దులను మూసివేసిన ఆసీస్ మరో ఆరు నెలల పాటు దీన్ని కొనసాగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే టోర్నీ నిర్వహణ కష్టం అవుతోంది. ఈ విషయాన్ని చర్చించడం కోసం సభ్య దేశాలతో పాటు అనుబంధ దేశాలతో ఐసీసీ 29న టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించనుంది. ఈ భేటీలో బీసీసీఐ తరపున కార్యదర్శి జై షా లేదా అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ పాల్గొనే అవకాశం ఉంది.
ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడైన షానే ఈ కాన్ఫరెన్స్లో పాల్గొంటారని ప్రచారం జరుగుతోంది. ఇక చైనాలో పుట్టిన ఈ ప్రాణాంతక కరోనా వైరస్ ప్రపంచమంతా పాకింది. మూడు లక్షల మంది ఈ వైరస్ బారిన పడ్డారు. సుమారు 16 వేల మందికి పైగా మరణించారు.