India Tour of New Zealand 2022 అట్టర్ ఫ్లాఫ్.. బెడిసికొట్టిన అమెజాన్ వ్యూహం!

హైదరాబాద్: న్యూజిలాండ్ పర్యటనను టీమిండియా ఓటమితో ముగించింది. మూడు టీ20ల సిరీస్ను 1-0తో కైవసం చేసుకున్న భారత్.. మూడు వన్డేల సిరీస్ను మాత్రం 0-1తో కోల్పోయింది. అయితే వర్షం కారణంగా ఈ సిరీస్ అట్టర్ ఫ్లాఫ్ అయ్యింది. మైదానంలో కంటే డ్రెస్సింగ్ రూమ్లోనే ఆటగాళ్లు ఎక్కువగా గడిపారు. మొత్తం 6 మ్యాచ్ల పర్యటనలో రెండే మ్యాచ్లు పూర్తిగా జరగ్గా.. మరో మూడు మ్యాచ్లు వర్షానికి ప్రభావితమయ్యాయి. ఓ మ్యాచ్ అయితే టాస్ కూడా పడకుండానే తుడిచిపెట్టుకుపోయింది. దాంతో ఈ పర్యటనను అభిమానులు కూడా లైట్ తీసుకున్నారు. అసలే టీ20 ప్రపంచకప్ వైఫల్యంతో మంట మీద ఉన్న అభిమానులు ఈ టూర్ను లైట్ తీసుకోగా.. చూసే ఆ కాస్త అభిమానులను కూడా వర్షం దూరం చేసింది.

చాలా మందికి ఈ టూర్ ఉందనే తెలియదు..
అసలు టీమిండియా న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లిందనే విషయం కూడా చాలా మంది క్రికెట్ అభిమానులకు తెలియదు. ఈ పర్యటనకు సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ దూరంగా ఉండటంతో సగం మంది ఈ టూర్ను లైట్ తీసుకున్నారు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లేని మ్యాచ్లను ఎవడు చూస్తాడని ఏ మాత్రం పట్టించుకోలేదు. దీనికి తోడు బ్రాడ్ కాస్టింగ్ సమస్యతో మరికొంతమంది దూరంగా ఉన్నారు. ఈ టూర్ బ్రాడ్ కాస్టింగ్ రైట్స్ స్టార్ స్పోర్ట్స్ వద్ద కాకుండా అమెజాన్ ప్రైమ్ వద్ద ఉండటంతో లైట్ తీసుకున్నారు.

టీవీల్లో రాకపోవడంతో..
అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ తీసుకునేందుకు ఆసక్తి కూడా చూపలేదు. 6 మ్యాచ్లకు రూ.599 చెల్లించడం అవసరమా? అని కూడా సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు. డీడీ స్పోర్ట్స్లో మ్యాచ్లు ప్రత్యక్షమైనా.. తొలుత వివిధ ఆపరేటర్లలో రాకుండా ఆంక్షలు విధించడంతో టీ20 సిరీస్ను చాలా మంది టీవీల్లో వీక్షించలేకపోయారు. ఆ తర్వాత అనుమతిచ్చినా.. వన్డే సిరీస్లో వర్షం కారణంగా ఒకే ఒక్క మ్యాచ్ సాధ్యమైంది. మ్యాచ్ టైమింగ్స్ భారత కాలమానం ప్రకారం 7 గంటలకు ఉండటం కూడా అభిమానులకు ఇబ్బందిగా మారింది. దాంతో చూసే ఫ్యాన్స్ కూడా స్కోర్ బోర్డులకే పరిమితమయ్యారు.

బీసీసీఐపై విమర్శలు..
ఏ ఉద్దేశంతో ఈ పర్యటనను ప్లాన్ చేశారో చెప్పాలని బీసీసీఐని ఫ్యాన్స్ నిలదీస్తున్నారు. కివీస్లో వర్షాలు కురుస్తాయని తెలిసి కూడా అక్కడ సిరీస్లు ప్లాన్ చేయడం బుద్ది తక్కువ నిర్ణయమని మండిపడుతున్నారు. ఈ పర్యటనలో గెలిచింది న్యూజిలాండ్, భారత్ కాదని వరణుడేనని కామెంట్ చేస్తున్నారు. ఇలాంటి బుద్ది తక్కువ నిర్ణయాలు భవిష్యత్తులో తీసుకోవద్దని చురకలు అంటిస్తున్నారు. ఈ పర్యటన వల్ల భారత క్రికెట్కు గానీ, అభిమానులకు గానీ వచ్చి ఫైదా ఏమైనా ఉందా? అని ప్రశ్నిస్తున్నారు.

అమెజాన్కు భారీ బొక్క..
ఈ రెండు సిరీస్లతో భారత క్రికెట్ అభిమానులను తమవైపు తిప్పుకోవాలని భావించిన అమెజాన్ సంస్థకు వర్షం కారణంగా గట్టి ఎదురుదెబ్బ తగిలింది. టీమిండియాలో యువత ఎక్కువగా ఉండటం.. సినిమాల కంటే ఎక్కువగా క్రికెట్ను మతంలా ఆరాధిస్తుండటంతో ఈ మార్కెట్ను గ్రాబ్ చేయాలని అమెజాన్ ప్రయత్నించింది. భారీ మొత్తంలో కొత్త సబ్స్క్రిప్షన్లను ఆశించిన అమెజాన్కు ఫలితం దక్కలేదు. మ్యాచ్లు సజావుగా సాగి.. రసవత్తరంగా జరిగి ఉంటే చాలా మంది ఆసక్తికనబరిచేవారు. కానీ వర్షంతో 4 మ్యాచ్లు రద్దవ్వడంతో అమెజాన్ వ్యూహం బెడిసికొట్టినట్లైంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications