చాలా మందికి ఈ టూర్ ఉందనే తెలియదు..
అసలు టీమిండియా న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లిందనే విషయం కూడా చాలా మంది క్రికెట్ అభిమానులకు తెలియదు. ఈ పర్యటనకు సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ దూరంగా ఉండటంతో సగం మంది ఈ టూర్ను లైట్ తీసుకున్నారు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లేని మ్యాచ్లను ఎవడు చూస్తాడని ఏ మాత్రం పట్టించుకోలేదు. దీనికి తోడు బ్రాడ్ కాస్టింగ్ సమస్యతో మరికొంతమంది దూరంగా ఉన్నారు. ఈ టూర్ బ్రాడ్ కాస్టింగ్ రైట్స్ స్టార్ స్పోర్ట్స్ వద్ద కాకుండా అమెజాన్ ప్రైమ్ వద్ద ఉండటంతో లైట్ తీసుకున్నారు.
టీవీల్లో రాకపోవడంతో..
అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ తీసుకునేందుకు ఆసక్తి కూడా చూపలేదు. 6 మ్యాచ్లకు రూ.599 చెల్లించడం అవసరమా? అని కూడా సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు. డీడీ స్పోర్ట్స్లో మ్యాచ్లు ప్రత్యక్షమైనా.. తొలుత వివిధ ఆపరేటర్లలో రాకుండా ఆంక్షలు విధించడంతో టీ20 సిరీస్ను చాలా మంది టీవీల్లో వీక్షించలేకపోయారు. ఆ తర్వాత అనుమతిచ్చినా.. వన్డే సిరీస్లో వర్షం కారణంగా ఒకే ఒక్క మ్యాచ్ సాధ్యమైంది. మ్యాచ్ టైమింగ్స్ భారత కాలమానం ప్రకారం 7 గంటలకు ఉండటం కూడా అభిమానులకు ఇబ్బందిగా మారింది. దాంతో చూసే ఫ్యాన్స్ కూడా స్కోర్ బోర్డులకే పరిమితమయ్యారు.
బీసీసీఐపై విమర్శలు..
ఏ ఉద్దేశంతో ఈ పర్యటనను ప్లాన్ చేశారో చెప్పాలని బీసీసీఐని ఫ్యాన్స్ నిలదీస్తున్నారు. కివీస్లో వర్షాలు కురుస్తాయని తెలిసి కూడా అక్కడ సిరీస్లు ప్లాన్ చేయడం బుద్ది తక్కువ నిర్ణయమని మండిపడుతున్నారు. ఈ పర్యటనలో గెలిచింది న్యూజిలాండ్, భారత్ కాదని వరణుడేనని కామెంట్ చేస్తున్నారు. ఇలాంటి బుద్ది తక్కువ నిర్ణయాలు భవిష్యత్తులో తీసుకోవద్దని చురకలు అంటిస్తున్నారు. ఈ పర్యటన వల్ల భారత క్రికెట్కు గానీ, అభిమానులకు గానీ వచ్చి ఫైదా ఏమైనా ఉందా? అని ప్రశ్నిస్తున్నారు.
అమెజాన్కు భారీ బొక్క..
ఈ రెండు సిరీస్లతో భారత క్రికెట్ అభిమానులను తమవైపు తిప్పుకోవాలని భావించిన అమెజాన్ సంస్థకు వర్షం కారణంగా గట్టి ఎదురుదెబ్బ తగిలింది. టీమిండియాలో యువత ఎక్కువగా ఉండటం.. సినిమాల కంటే ఎక్కువగా క్రికెట్ను మతంలా ఆరాధిస్తుండటంతో ఈ మార్కెట్ను గ్రాబ్ చేయాలని అమెజాన్ ప్రయత్నించింది. భారీ మొత్తంలో కొత్త సబ్స్క్రిప్షన్లను ఆశించిన అమెజాన్కు ఫలితం దక్కలేదు. మ్యాచ్లు సజావుగా సాగి.. రసవత్తరంగా జరిగి ఉంటే చాలా మంది ఆసక్తికనబరిచేవారు. కానీ వర్షంతో 4 మ్యాచ్లు రద్దవ్వడంతో అమెజాన్ వ్యూహం బెడిసికొట్టినట్లైంది.