సెంచూరియన్: గత మ్యాచ్లో క్వింటన్ డికాక్ తొండాటతో డబుల్ సెంచరీ చేజార్చుకోవడంతో పాటు జట్టుకు విజయాన్నందుకోలేకపోయిన పాకిస్థాన్ ఓపెనర్ ఫకర్ జమాన్.. ఆఖరి మ్యాచ్లో అదరగొట్టాడు. సెంచరీతో చెలరేగి సౌతాఫ్రికా జట్టుపై కసితీర్చుకున్నాడు. ఫకర్ జమాన్ (104 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్లతో 101) సెంచరీకి తోడుగా కెప్టెన్ బాబర్ ఆజమ్ (82 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్లు 97 ), ఇమామ్ ఉల్ హఖ్ (57) అర్ధ సెంచరీలు సాధించడంతో... సౌతాఫ్రికాతో బుధవారం జరిగిన చివరిదైన మూడో వన్డేలో పాకిస్థాన్ 28 పరుగుల తేడాతో గెలిచింది. ఫలితంగా సిరీస్ను 2-1తో సొంతం చేసుకుంది. 2013 తర్వాత సఫారీ గడ్డపై పాక్ వన్డే సిరీస్ నెగ్గడం గమనార్హం. సఫారీ గడ్డపై పాక్కు ఇది రెండో వన్డే సిరీస్ విజయం. దాంతో ఈ ఘనతను అందుకున్న తొలి ఆసియా జట్టుగా పాక్ నిలిచింది.
ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 50 ఓవర్లలో 7 వికెట్లకు 320 పరుగులు సాధించింది. చివర్లో హసన్ అలీ (11 బంతుల్లో 32 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. రెండో వికెట్కు ఫకర్, బాబర్ 94 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. సఫారీ బౌలర్లలో కేశవ్ మహరాజ్ మూడు వికెట్లు తీయగా.. మార్క్రమ్ రెండు వికెట్ల పడగొట్టాడు. ఫెలుక్వాయో, స్మట్స్కు తలో వికెట్ దక్కింది.
అనంతరం సౌతాఫ్రికా 49.3 ఓవర్లలో 292 పరుగులకు ఆలౌటైంది. మలన్(70), వెరీన్ (62), ఫెలుక్వాయో (54) అర్ధ సెంచరీలు మినహా మిగతా బ్యాట్స్మెన్ విఫలమయ్యాడు. పాక్ బౌలర్లలో షాహీన్ అఫ్రిది, నవాజ్లకు మూడేసి వికెట్లు దక్కగా.. హారిస్ రౌఫ్ రెండు వికెట్లు తీశాడు. హసన్ అలీ, ఉస్మాన్ ఖాదీర్లకు చెరొక వికెట్ లభించింది. అయితే ఈ మ్యాచ్లో సౌతాఫ్రికా సీనియర్లు ఆడలేదు. ఐపీఎల్ కోసం వారిని సఫారీ క్రికెట్ బోర్డు రిలీజ్ చేసింది. దాంతో యువ ఆటగాళ్లతో బరిలోకి దిగిన సఫారీ టీమ్ విజయాన్నందుకోలేకపోయింది. ఇక ఈ మ్యాచ్లో సాధించిన సెంచరీతో ఫకార్ జమాన్ అరుదైన ఘనత సొంతం చేసుకున్నాడు. సఫారీ గడ్డపై వరుసగా సెంచరీలు బాదిన మూడో విదేశీ ఆటగాడిగా నిలిచాడు. అతనికన్నా ముందు పీటర్సన్, జోరూట్ మాత్రమే ఈ ఘనతను అందుకున్నారు.