|
అసలేం జరిగిందంటే..
ఆఖరి ఓవర్లో కోల్కతా నైట్రైడర్స్ విజయానికి 6 బంతుల్లో 21 పరుగులు అవసరమవ్వగా.. లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్.. ఆల్రౌండర్ మార్కస్ స్టోయినిస్ చేతికి బంతినిచ్చాడు. కానీ.. స్టోయినిస్ బౌలింగ్లో తొలుత ఒత్తిడికి గురయ్యాడు. దాంతో.. తొలి మూడు బంతుల్నీ యువ ప్లేయర్ రింకూ సింగ్ (15 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్లతో 40) వరుసగా 4,6,6గా హ్యాట్రిక్ బౌండరీలు బాదడంతో.. సమీకరణం 3 బంతుల్లో 5 పరుగులతో తేలికగా మారిపోయింది. దాంతో.. కోల్కతా విజయం ఖాయమని అంతా భావించారు.
|
స్టన్నింగ్ క్యాచ్తో...
కానీ.. నాలుగో బంతిని మిడ్ వికెట్ దిశగా హిట్ చేసి రెండు పరుగులు చేసిన రింకూ సింగ్.. ఐదో బంతిని ఎక్స్ట్రా కవర్స్ దిశగా గాల్లోకి లేపాడు. నిజానికి అక్కడ ఫీల్డర్ కూడా ఎవరూ లేకపోవడంతో.. రెండు పరుగులు వచ్చేలా కనిపించాయి. అయితే.. డీప్ బ్యాక్వర్డ్ పాయింట్ నుంచి వేగంగా పరుగెత్తుకొచ్చిన ఫీల్డర్ ఎవిన్ లూయిస్ పక్కకి డైవ్ చేస్తూ ఒంటిచేత్తో అందుకున్నాడు. దాంతో.. సమీకరణం ఒక బంతికి 3 పరుగులుగా మారిపోగా.. ఆఖరి బంతిని ఆడిన ఉమేశ్ యాదవ్ క్లీన్ బౌల్డయ్యాడు. దాంతో సునాయసంగా గెలవాల్సిన మ్యాచ్లో కేకేఆర్ 2 పరుగులతో ఓటమిపాలై ఇంటిదారి పట్టింది.
శతక్కొట్టిన డికాక్..
ఉత్కంఠకే ఊపిరి అందని రీతిలో సాగిన ఈ హై ఓల్టేజ్ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 210 పరుగుల భారీ స్కోర్ చేసింది. క్వింటన్ డికాక్(70 బంతుల్లో 10 ఫోర్లు, 10 సిక్స్లతో 140 నాటౌట్) భారీ శతకంతో చెలరేగగా.. కెప్టెన్ కేఎల్ రాహుల్(51 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్లతో 68 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో రాణించాడు. ఈ ఇద్దరి విధ్వంసంతో కోల్కతా బౌలర్లు తేలిపోయారు. కనీసం ఒక్క వికెట్ కూడా తీయలేకపోయారు.
కేకేఆర్ పోరాడినా..
అనంతరం లక్ష్యచేధనకు దిగిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 208 పరుగులు చేసి ఓటమిపాలైంది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(29 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్లతో 50) హాఫ్ సెంచరీతో రాణించగా.. నితీశ్ రాణా(22 బంతుల్లో 9 ఫోర్లతో 42), సామ్ బిల్లింగ్స్ (24 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్లతో 36), రింకూ సింగ్(15 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్లతో 40) ధాటిగా ఆడారు. లక్నో బౌలర్లలో మోహ్సిన్ ఖాన్, మార్కస్ స్టోయినీస్ మూడేసి వికెట్లు తీయగా.. కృష్ణప్ప గౌతమ్, రవి బిష్ణోయ్ తలో వికెట్ పడగొట్టారు. ఈ ఓటమితో కేకేఆర్ ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించగా.. లక్నో 18 పాయింట్లతో రెండో స్థానాన్ని కైవసం చేసుకుంది.