బంతి స్టోక్స్కు తగిలి బౌండరీకి
న్యూజిలాండ్ ఫీల్డర్ నుంచి వచ్చిన బంతి స్టోక్స్కు తగిలి బౌండరీకి తరలింది. దీంతో ఆ బంతికి మొత్తం ఆరు పరుగులు వచ్చాయి. స్టోక్స్ మొదట చేసిన రెండు పరుగులతో పాటు.. బంతి బౌండరీని తగలడం వల్ల వచ్చిన నాలుగు పరుగులను ఇంగ్లండ్ ఖాతాలో వేశారు. దీంతో ఇంగ్లాండ్ విజయ సమీకరణం రెండు బంతుల్లో మూడు పరుగులుగా మారింది. ఆ తర్వాత బెన్ స్టోక్స్ మళ్లీ రెండు పరుగులకు ప్రయత్నించాడు.
రెండో పరుగుకు వెళ్తుండగా
ఒక పరుగు పూర్తిచేసి రెండో పరుగుకు వెళ్తుండగా అదిల్రషీద్ రనౌటయ్యాడు. దీంతో చివరి బంతికి రెండు పరుగులు అవసరమయ్యాయి. స్టోక్స్ మళ్లీ రెండు పరుగులకు ప్రయత్నించగా ఈసారి మార్క్వుడ్ రెండో పరుగుకు రనౌటయ్యాడు. దీంతో ఇంగ్లాండ్ కూడా నిర్ణీత 50 ఓవర్లలో 241 పరుగులే చేయడంతో మ్యాచ్ టైగా ముగిసింది. దీంతో మ్యాచ్ సూపర్ ఓవర్కు దారి తీసింది.
ఓవర్త్రోలో ఆరు పరుగులు
అయితే ఓవర్త్రోలో ఆరు పరుగులు ఇవ్వాలా లేక ఐదు పరుగులు ఇవ్వాలా అన్నది ఐసీసీనే అధికారికంగా ప్రకటించింది. ఐసీసీలోని 19.8 రూల్ ప్రకారం.. ఓవర్త్రో రూపంలో బంతి బౌండరీ వెళ్లినా లేక ఫీల్డర్ కావాలని అడ్డుకున్నప్పుడు బంతి బౌండరీ దాటిన సందర్భాల్లో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో 19.8 రూల్ చెబుతుంది. ఆ రూల్ ప్రకారం ఇంగ్లాండ్కు 5 పరుగులు మాత్రమే ఇవ్వాలి.
ఓవర్త్రోకు ఐదు పరుగులు మాత్రమే ఇవ్వాలి
కానీ, అంపైర్ ధర్మసేన తన సహచరులతో చర్చించి ఆరు పరుగులు ఇచ్చాడు. దీనిపై ఫాక్స్ స్పోర్ట్స్కు ఇచ్చిన ఇంటర్యూలో ఐదు సార్లు ఐసీసీ అంపైర్ ఆప్ ద ఇయర్ అవార్డుని సొంతం చేసుకున్న సైమన్ టోఫెల్ మాట్లాడుతూ "నిబంధన 19.8 ప్రకారం ఫీల్డర్ త్రో సంధించిన సమయంలో ఇద్దరు బ్యాట్స్మెన్ పిచ్పై ఒకరిని మరొకరు దాటితేనే రెండో పరుగును లెక్కించాలి. వీడియో రీప్లేలో చూస్తే ఫీల్డర్ బంతిని విసిరినప్పుడు వీరిద్దరు ఒకరిని మరొకరు దాటలేదు. కాబట్టి బౌండరీతో పాటు సింగిల్నే అనుమతించాల్సింది. అప్పుడు ఒక పరుగు తగ్గడంతో పాటు రషీద్ స్ట్రయికింగ్ తీసుకోవాల్సి వచ్చేది" అని ఆయన అన్నారు.
అంఫైర్ ఫోకస్ అంతా బంతిపైనే ఉంటుంది
అయితే తాను అంపైర్ను విమర్శించడం లేదని, అదంతా ఆ సమయంలో మైదానంలో ఉండే ఉద్వేగాలు, వేడిలో అలాంటిది జరిగిపోయిందని అన్నారు. "స్టోక్స్ పరుగు పూర్తి చేసే స్థితిలో ఉన్నాడని అంపైర్ భావించి ఉండవచ్చు. ఈ నిర్ణయం ప్రభావం మ్యాచ్పై కొంత మేరకు ఉన్నా, తుది ఫలితానికి ఇది మాత్రం కారణం కాదు" అని సైమన్ టోఫెల్ చెప్పాడు.