హైదరాబాద్: ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న భారత-ఎ జట్టుకి కోచ్ రాహుల్ ద్రవిడ్ స్వేచ్ఛనిస్తున్నారని జట్టు ఓపెనర్ పృథ్వీ షా వెల్లడించాడు. ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ఎలెవన్తో తాజాగా జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్లో భారత-ఎ జట్టు 125 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఓపెనర్ పృథ్వీ షా 61 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సులతో(70) హాఫ్ సెంచరీతో జట్టుకి శుభారంభాన్నందించాడు.
మిడిలార్డర్లో కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్45 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్సు సాయంతో.. (54), ఇషాన్ కిషన్ 46 బంతుల్లో 4ఫోర్లు, 2 సిక్సులతో (50) రాణించడంతో తొలుత బ్యాటింగ్ చేసిన భారత-ఎ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 328 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం ఛేదనకు దిగిన ఇంగ్లాండ్ జట్టు దీపక్ చాహర్ (3/48), అక్షర్ పటేల్ (2/21) ధాటికి 203 పరుగులకే కుప్పకూలిపోయింది.
'మ్యాచ్ల్లో అనుసరించాల్సిన టెక్నికల్ వ్యూహాల గురించి రాహుల్ ద్రవిడ్ సర్ జట్టుతో ఎక్కువగా చర్చించలేదు. కానీ.. మైదానంలో మానసిక దృఢంతో ఎలా ఉండాలో మాత్రం చెప్పారు. రాహుల్ సార్, పాంటింగ్ ఇద్దరూ అంతే.. జట్టులో ప్రతికూల ఆలోచనలు లేకుండా చూస్తారు. ఇంగ్లాండ్ పర్యటన గురించి రాహుల్ ద్రవిడ్ సార్ ఒక్కటే చెప్పారు.. మీ సహజమైన ఆటను ఆడండని. ఇక్కడ పరిస్థితుల్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం.. మెరుగైన ప్రదర్శనని కొనసాగించాలంటే జాగ్రత్తగా ఆడాల్సిందే' అని పృథ్వీ షా వెల్లడించాడు.
ద్రవిడ్ చెప్పిన దానికనుగుణంగా కేవలం పరుగులు రాబట్టడంపైనే ఫోకస్ చేస్తున్నానని తెలిపాడు పృథ్వీషా. ఇంగ్లాండ్లో జరగనున్న ఐసీసీ వరల్డ్ కప్కు కూడా రాణించాలనే ఉద్దేశ్యంతో ద్రవిడ్ ఇస్తున్న శిక్షణను సద్వినియోగం చేసుకుంటామనే నమ్మకాన్ని వ్యక్తం చేశాడు.