న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక దేశవాళీ టోర్నీ విజయ్ హజారే ట్రోఫీని నిర్వహిస్తున్న తీరుపై టీమిండియా వెటరన్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ అసహనం వ్యక్తం చేశాడు. ఈ టోర్నీ నిర్వహిస్తున్న తీరు తలా తోకా లేకుండా ఉందని చెప్పాడు. తమిళనాడు వంటి ఎలైట్ హోదా ఉన్న జట్టుతో అనామక అరుణాచల్ ప్రదేశ్ ఆడటం ఏంటని ప్రశ్నించాడు. టోర్నీ నిర్వహణ తీరుపై బీసీసీఐని నిలదీసాడు.
ఈ టోర్నీలో భాగంగా మంగళవారం అరుణాచల్ ప్రదేశ్తో జరిగిన మ్యాచ్లో తమిళనాడు 506 పరుగుల భారీ స్కోర్ చేసిన విషయం తెలిసిందే. అనంతరం అరుణాచల్ ప్రదేశ్ 71 పరుగులకే ఆలౌటై ఘోర పరాజయం చవిచూసింది. ఈ మ్యాచ్పై ట్విటర్ వేదికగా స్పందించిన దినేశ్ కార్తీక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'వరల్డ్ రికార్డ్ అలర్ట్.. జగదీశన్-సాయి సుదర్శన్ గొప్ప ప్రదర్శన చేశారు. మీ ఆట చాలా ఆనందం కలిగించింది. ఈ ఓపెనింగ్ జోడీ అద్భుతాలు చేస్తున్నది. వెల్ డన్ బాయ్స్..' అని జట్టును ప్రశంసల్లో ముంచెత్తాడు.
ఆ తర్వాత మరో ట్వీట్ లో.. 'అసలు ఎలైట్ లిస్ట్ లో ఉన్న జట్లతో ఈశాన్య రాష్ట్రాల క్రికెట్ జట్లు లీగ్ దశలో పోటీ పడటం ఏమైనా సెన్స్ ఉందా..? ఇది ఎలైట్ జట్ల రన్ రేట్లను మార్చివేస్తుంది. ఒకవేళ వర్షం వచ్చి మ్యాచ్ కు అంతరాయం కలిగిస్తే పరిస్థితిని ఒకసారి ఊహించండి.. ఎలౌట్ గ్రూప్ లో లేని జట్లను సెపరేట్ గ్రూప్ గా చేసి వాటితో క్వాలిఫై ఆడించలేరా..?' అని ప్రశ్నలు సంధించాడు.
WORLD RECORD alert
— DK (@DineshKarthik) November 21, 2022
What an amazing effort by @Jagadeesan_200 . Couldn’t be happier for him. Big things await #5outta5
Sai Sudarshan what an amazing tournament so far. This opening combo is killing it .
Well done boys @TNCACricket #VijayHazareTrophy
గ్రూప్ సీలో భాగంగా బెంగళూరు వేదికగా అరుణాచల్ ప్రదేశ్తో జరిగిన మ్యాచ్ తమిళనాడు నిర్ణీత 50 ఓవర్లలో 2 వికెట్లకు 506 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఆ జట్టు ఓపెనర్లు నారయణ్ జగదీషన్(141 బంతుల్లో 25 ఫోర్లు, 15 సిక్సర్లతో 277) డబుల్ సెంచరీ చేయగా.. సాయి సుదర్శన్(102 బంతుల్లో 19 ఫోర్లు, 2 సిక్స్లతో 154) సెంచరీతో రాణించాడు. ఈ ఇద్దరూ అసాధారణ బ్యాటింగ్తో తొలి వికెట్కు 416 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని అందించారు. బాబా అపరజిత్(31 నాటౌట్), బాబా ఇంద్రజీత్(31 నాటౌట్) కూడా రాణించడంతో తమిళనాడు 500 పరుగుల మార్క్ను అందుకుంది. 50 ఓవర్ల ఫార్మాట్లోనే ఇది అత్యధిక స్కోర్ కావడం విశేషం.