సీనియర్ టీమ్ ఛలో ఇంగ్లండ్..
రెగ్యూలర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, రిషభ్ పంత్, కేఎల్ రాహుల్, మహమ్మద్ షమీ, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, చతేశ్వర్ పుజారా, మహమ్మద్ సిరాజ్లు ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ పర్యటన నేపథ్యంలో సీనియర్ ఆటగాళ్లందరికి సౌతాఫ్రికాతో జూన్ 9 నుంచి 19 వరకు ఢిల్లీ, కటక్, వైజాగ్, రాజ్కోట్ వేదికగా జరిగే 5 టీ20ల సిరీస్ నుంచి విశ్రాంతివ్వనుంది. ఈ పరిమిత ఓవర్ల సిరీస్కు ఐపీఎల్లో సత్తా చాటిన ఆటగాళ్లు, అనుభవం కలిగిన ప్లేయర్లతో కూడిన జట్టును ఎంపిక చేయనున్నారు.
తిలక్ వర్మకు టీమిండియా పిలుపు..
తెలుగు తేజం తిలక్ వర్మతో పాటు ఉమ్రాన్ మాలిక్, అర్షదీప్ సింగ్, రుతురాజ్ గైక్వాడ్, ప్రసిధ్ కృష్ణ, ఆవేశ్ ఖాన్లకు ఈ జట్టులో అవకాశం దక్కనుంది. తిలక్ వర్మకు అవకాశం దక్కితే అంబటి రాయుడి తర్వాత భారత జట్టులో చోటు దక్కించుకున్న తెలుగు ప్లేయర్గా నిలుస్తాడు. 2019లో రాయుడి భారత జట్టుకు చివరిసారిగా ప్రాతినిథ్యం వహించగా.. మళ్లీ ఇన్నాళ్లకు మరో తెలుగోడి పేరు వినిపిస్తోంది.
ఈ యువ ఆటగాళ్లకు అండగా అనుభవం కలిగిన హార్దిక్ పాండ్యా, శిఖర్ ధావన్, భువనేశ్వర్ కుమార్, దినేశ్ కార్తీక్లను జట్టులోకి తీసుకోనున్నారు. శిఖర్ ధావన్ లేదా హార్దిక్ పాండ్యా జట్టును నడిపించే అవకాశం ఉంది. గతేడాది సీనియర్ టీమ్ ఇంగ్లండ్ పర్యటనలో ఉండగా.. శిఖర్ ధావన్ నేతృత్వంలోని ద్వితీయ శ్రేణి జట్టును శ్రీలంక పంపిస్తూ బీసీసీఐ చేసిన ప్రయోగం సక్సెస్ అయింది. దాంతోనే ఈ సారి కూడా అదే ఫార్మూలాను ఉపయోగించుకోవాలనుకుంటుంది.
సూర్య డౌట్..
గాయపడ్డ సూర్యకుమార్ యాదవ్ గురించి టీమ్ సెలెక్షన్ ముందు తుది నిర్ణయం తీసుకోనున్నారు. అతను ఫిట్ అయితే ఈ ద్వితీయ శ్రేణి జట్టులోకి రానున్నాడు. ఈ సిరీస్ల కోసం రాహుల్ ద్రవిడ్ నేతృత్వంలోని కోచింగ్ టీమ్ కూడా రెండుగా విడిపోనుంది. ఇక సౌతాఫ్రికాతో ఆడే ద్వితీయ శ్రేణి జట్టునే ఐర్లాండ్ పర్యటనకు పంపించే యోచనలో బీసీసీఐ ఉంది. డబ్లిన్ వేదికగా జూన్ 26, 28న రెండు మ్యాచ్ల టీ20 సిరీస్ జరగనుంది. సీనియర్ టీమ్ జూన్ 16న ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. జూలై 1-5 వరకు జరిగే బర్మింగ్హాట్ టెస్ట్కు ముందు వార్మప్ మ్యాచ్ నిర్వహించే విషయమై బీసీసీఐ.. ఇంగ్లండ్ వేల్స్ క్రికెట్ బోర్డుతో చర్చలు జరుపుతోంది.
రహానే దూరం..
ఐపీఎల్లో తొడకండరాల గాయానికి గురైన అజింక్యా రహానే ఇంగ్లండ్ పర్యటనకు దాదాపు దూరమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే పేలవ బ్యాటింగ్తో జట్టులో చోటు కోల్పోయిన రహానే.. ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన గత మ్యాచ్లో గాయపడ్డాడు. ఆ తర్వాత అతను ఫీల్డింగ్ కూడా చేయలేదు. గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో లీగ్ నుంచి తప్పుకున్న అతను బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో రిహాబిలిటేషన్ తీసుకునేందుకు సిద్దమైనట్లు బోర్డు వర్గాలు పేర్కొన్నాయి.