|
వారికి మద్దతు ఉండాలనే
రవిచంద్రన్ అశ్విన్ హఠాత్తుగా ఐపీఎల్ 2021 నుంచి వైదొలగడానికి అసలు కారణం అతని కుటుంబమే. కరోనా మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో కుటుంబానికి అండగా ఉండాలనే కారణంతో అశ్విన్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. 'రేపటి నుంచి ఐపీఎల్ 2021కి విరామం ఇస్తున్నా. నా కుటుంబ సభ్యులు కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా పోరాడుతున్నారు. ఈ కఠినమైన సమయాల్లో నేను వారికి మద్దతు ఇవ్వాలనుకుంటున్నా. అన్ని సవ్యంగా ఉంటే.. ఐపీఎల్ 2021కి తిరిగి రావాలని ఆశిస్తున్నాను. ఢిల్లీ ప్రాంచైజీకి ధన్యవాదాలు' అని అశ్విన్ ట్వీట్ చేశాడు.
తమిళనాడులో వైరస్ కలకలం
ఆర్ అశ్విన్ కుటుంబం చెన్నైలో నివసిస్తోన్న విషయం తెలిసిందే. చెన్నై సహా తమిళనాడు వ్యాప్తంగా వేల సంఖ్యలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని తమిళనాడు ప్రభుత్వం వీకెండ్ లాక్డౌన్ను అమలు చేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో కుటుంబంతో గడపాలనే కారణంతో అశ్విన్ ఐపీఎల్ 2021 సీజన్ నుంచి తప్పుకొన్నాడు. అంతకుముందు పంజాబ్ కింగ్స్ జట్టుకు ఆడిన యాష్.. గతేడాది నుంచి ఢిల్లీకి ఆడుతున్నాడు. అశ్విన్ సుదీర్ఘ కాలం చెన్నైకే ఆడిన విషయం తెలిసిందే. యాష్ ఐపీఎల్ టోర్నీలో 159 మ్యాచుల్లో 139 వికెట్లు పడగొట్టాడు.
5 మ్యాచ్లు.. ఒక వికెట్
రవిచంద్రన్ అశ్విన్.. ఈ ఐపీఎల్ సీజన్లో ఆశించిన స్థాయిలో రాణించలేక పోతున్నాడు. ఇప్పటిదాకా 5 మ్యాచ్లను ఆడిన అశ్విన్.. తీసింది ఒకే ఒక్క వికెట్. అంతేకాదు ధారాళంగా పరుగులను సమర్పించుకుంటున్నాడు. ఫామ్ అందుకునే లోపే అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. వ్యక్తిగత కారణాలతో ఇప్పటికే ఇద్దరు క్రికెటర్లు ఐపీఎల్ 2021 సీజన్ నుంచి ఇంటిదారి పట్టారు. రాజస్థాన్ రాయల్స్ ఫాస్ట్ బౌలర్ అండ్రూ టై అర్ధాంతరంగా టోర్నమెంట్ నుంచి నిష్క్రమించగా.. అదే జట్టుకు చెందిన లియామ్ లివింగ్స్టోన్ కూడా ఇంటిదారి పట్టాడు.
సూపర్ ఓవర్లో విజయం
చెన్నై చెపాక్లోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ఆదివారం రాత్రి సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ సూపర్ ఓవర్లో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 159 పరుగులు చేసింది. పృథ్వీ షా (39 బంతుల్లో 53; 7 ఫోర్లు, ఒక సిక్సర్) ఆఫ్ సెంచరీతో రాణించాడు. లక్ష్యఛేదనలో సన్రైజర్స్ సరిగ్గా 20 ఓవర్లలో 7 వికెట్లకు 159 పరుగులే చేయడంతో మ్యాచ్ సూపర్ ఓవర్కు దారితీసింది. కేన్ విలియమ్సన్ (66 నాటౌట్; 8 ఫోర్లు) అజేయ అర్ధశతకం చేశాడు. అక్షర్ వేసిన సూపర్ ఓవర్లో హైదరాబాద్ 7 పరుగులే చేయగా.. అనంతరం పంత్ ధాటిగా ఆడటంతో ఢిల్లీ గెలుపొందింది.