హిట్టర్లతో పంజాబ్
ఐపీఎల్లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్కు ఉన్న పేరు అండర్ డాగ్స్. స్టార్ ఆటగాళ్లు అందుబాటులో ఉన్నా.. టైటిల్ ఫేవరేట్గా బరిలోకి దిగినా.. ఆఖర్లో చతికలబడటం ఆ జట్టు ఆనవాయితీ. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఐపీఎల్ రాజ్యాన్ని ఏలేలా కనిపిస్తోంది. కొత్త కెప్టెన్ లోకేశ్ రాహుల్.. నూతన కోచ్ అనిల్ కుంబ్లేతో ఆ జట్టులో ఉత్సాహం ఉరకలెత్తుతోంది. బ్యాటింగ్లో కేఎల్ రాహుల్, క్రిస్ గేల్, గ్లెన్ మ్యాక్స్వెల్ నికోలస్ పూరన్.. ధనాధన్ క్రికెట్కు సరిపోయే ఆటగాళ్లు. అజింక్య రహానే, మయాంక్ అగర్వాల్తో టాపార్డర్ మరింత బలంగా కనిపిస్తోంది. చెలరేగడానికి జేమ్స్ నీషమ్, సర్ఫరాజ్ ఖాన్ ఉన్నారు. ఇక బౌలింగ్ విభాగం కూడా ముజీబ్ రెహ్మాన్, మహ్మద్ షమీ, షెల్డన్ కాట్రెల్, క్రిస్ జోర్డాన్, గౌతమ్తో మెరుగ్గానే ఉంది.
యువకులతో పటిష్టంగా ఢిల్లీ:
ఢిల్లీ క్యాపిటల్స్ గత సీజన్లో ప్లే ఆఫ్స్ వరకు వెళ్లినా.. క్వాలిఫయర్-2లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓడింది. అయితే ఈ సారి లెక్క మారేలా ఉంది. కోచ్ రికీ పాంటింగ్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని టీమ్ కొత్తగా, చాలా బలంగా కనిపిస్తున్నది. గత సీజన్లతో పోలిస్తే ఓ అడుగు ముందే ఉంటుందని అంచనాలున్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో యువ క్రికెటర్లు ఎక్కువగా ఉన్నారు. శిఖర్ ధావన్, పృథ్వీ షా, షిమ్రాన్ హిట్మెయర్, శ్రేయాస్ అయ్యర్, మార్కస్ స్టోయినిస్, రిషబ్ పంత్లతో బ్యాటింగ్ బలంగానే ఉంది.
ఇషాంత్కు గాయం:
ఇషాంత్ శర్మ, కగిసో రబాడ, కీమో పాల్, అన్రిచ్ నోర్జ్, అక్షర్ పటేల్, సందీప్ లామిచ్చనే, ఆర్ అశ్విన్తో ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ విభాగం కూడా మంచి సమతూకంతో ఉంది. అయితే స్టార్ పేసర్ ఇషాంత్ శర్మకు తొలి మ్యాచుకు ముందే గాయం అయింది. ప్రాక్టీస్ సమయంలో అతడు గాయపడ్డాడు. దీంతో ఈరోజు మ్యాచుకు అతడు అందుబాటులో ఉండడని సమాచారం. అతని స్థానంలో అన్రిచ్ నోర్జ్ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. నిరుడు పంజాబ్కు నాయకత్వం వహించిన అశ్విన్.. ఈసారిఢిల్లీకి ఆడుతున్న నేపథ్యంలో తొలి మ్యాచ్ అతడికి ప్రత్యేకం.
24 సార్లు తలపడగా:
ఐపీఎల్ 2019 సీజన్లో రెండు మ్యాచ్ల్లో తలపడిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్, ఢిల్లీ క్యాపిటల్స్.. చెరో మ్యాచ్లో గెలుపొందాయి. ఐపీఎల్ లీగ్లో 24 సార్లు ఇరు జట్లు తలపడగా.. 10 మ్యాచుల్లో ఢిల్లీ, 14 మ్యాచుల్లో పంజాబ్ గెలిచాయి. మొత్తంగా ఢిల్లీపై పంజాబ్ ఆధిపత్యం వహించింది. ఈసారి ఆడుతాయో చూడాలి. ఆరంభ మ్యాచ్లో విజయం ఇచ్చే ఉత్సాహమే వేరు కావడంతో ఇరు జట్లూ అందుకోసం గట్టిగానే ప్రయత్నించే అవకాశముంది.
తుది జట్లు (అంచనా):
ఢిల్లీ: శిఖర్ ధావన్, పృథ్వీ షా, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్, షిమ్రాన్ హిట్మెయర్, మార్కస్ స్టోయినిస్, అక్షర్ పటేల్, ఆర్ అశ్విన్, హర్షల్ పటేల్, కగిసో రబాడ, లామిచ్చనే/అన్రిచ్ నోర్జ్.
పంజాబ్: క్రిస్ గేల్, కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, నికోలస్ పూరన్, గ్లెన్ మ్యాక్స్వెల్, సర్ఫరాజ్ ఖాన్, కే గౌతం, క్రిస్ జోర్డాన్, మహ్మద్ షమీ, ఎం అశ్విన్, ఇషాన్ పోరెల్.
ఏమైనా సందేహాలు ఉన్నాయా? .. ఈసారి ఆ జట్టే ఐపీఎల్ టైటిల్ గెలుస్తుంది: సచిన్