
ముంబై: క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 సీజన్ ప్రారంభం అయింది. లీగ్ తొలి పోరులో డిఫెండింగ్ చాంపియన్స్ ముంబై ఇండియన్స్ జట్టును రన్నరప్ చెన్నై సూపర్ కింగ్స్ ఓడించింది. కరోనా కారణంగా ఐపీఎల్ 2020ని యూఏఈకి తరలినా.. దేశవ్యాప్తంగా మెగా టోర్నీపై అభిమానులకు ఉన్న క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. అందరూ టీవీలకు అతుక్కుపోయారు. మెగా లీగ్పై మాజీ ఆటగాళ్లు, క్రికెట్ విశ్లేషకులు తమ అంచనాలను, విశ్లేషణలు మొదలుపెట్టారు. ఈ క్రమంలో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కూడా తన టైటిల్ ఫేవరేట్ జట్టు ఎదో చెప్పారు.
ఐపీఎల్ లీగ్లో అత్యంత విజయవంతమై జట్లు ఈసారి విజేత కాబోతుందని సచిన్ టెండూల్కర్ జోస్యం చెప్పారు. లీగ్లో విజయవంతమైన జట్టు ముంబై ఇండియన్స్ టీంకు సచిన్ ఓటేశారు. ఐపీఎల్ 2020 టైటిల్ ముంబై గెలుస్తుందని సచిన్ ధీమా వ్యక్తం చేశారు. అంతేకాదు ఏమైనా సందేహాలు ఉన్నాయా అని ప్రశ్నించారు. ఎప్పుడూ మెన్ ఇన్ బ్లూ (టీమిండియా, ముంబై ఇండియన్స్) తరపునే ఆడాను అని పేర్కొన్నారు. ఆకాష్ చోప్రా యూట్యూబ్ ఛానెల్లో మాట్లాడుతూ సచిన్ ఈ విషయాన్ని చెప్పారు. గతంలో ముంబైకి సారథిగా ఉన్న సచిన్.. ఇపుడు మెంటార్ పాత్ర పోషిస్తున్నారు.
ఈసారి టైటిల్ గెలిచే అవకాశం ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ఉందా అని ఆకాష్ చోప్రా అడగ్గా.. జట్టు బాగుంది, ఆటగాళ్ల ప్రదర్శనపై ముడిపడి ఉందని సచిన్ టెండూల్కర్ పేర్కొన్నారు. అన్ని జట్లు భిన్నమైనవి అని, 53 రోజుల వ్యవధిలో ఏ జట్టు అయినా పుంజుకోగలదు అని సచిన్ చెప్పారు. మంచి ఆరంభాలు దక్కితే టోర్నీ బాగా ముగుస్తుందన్నారు.
తాజాగా మాంటీ పనేసర్ మాట్లాడుతూ.. ఐపీఎల్ 2020 విజేత, ప్లే ఆఫ్ చేరే జట్ల వివరాలు తెలిపాడు. ఐపీఎల్ 2020 విజేతగా ఢిల్లీ క్యాపిటల్స్ నిలుస్తుందని జోస్యం చెప్పాడు. యువకులు, అనుభవజ్ఞులతో ఢిల్లీ జట్టు మంచి సమతూకంతో ఉందని పేర్కొన్నాడు. యూఏఈ పరిస్థితులు ఇతర ఫ్రాంచైజీల కంటే ఢిల్లీ ఆటగాళ్లకు అనుకూలంగా ఉంటాయని చెప్పాడు. రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్ మరియు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు ఐపీఎల్ 2020లో తన ఫేవరేట్ జట్లుగా పేర్కొన్నాడు.