నన్ను టార్గెట్ చేస్తూ:
బరోడా టీమ్ నుంచి వెళ్లిపోవడానికి గల కారణాన్ని దీపక్ హుడా ఈ మెయిల్ ద్వారా బరోడా క్రికెట్ అసోసియేషన్కు వివరించాడు. 'టీమ్ సభ్యులు, ఇతర టీమ్స్ ముందు కృనాల్ పాండ్యా నన్ను దుర్భాషలాడాడు. నేను 11 ఏళ్లుగా బరోడా జట్టు తరఫున ఆడుతున్నాను. కానీ ఇప్పుడు నేను పూర్తిగా నిరాశ చెందాను. తీవ్ర ఒత్తిడిలో ఉన్నాను. కొన్ని రోజుల నుంచీ కృనాల్ నాపై నోరు పారేసుకుంటున్నాడు. ఇటీవల జరిగిన టీమ్ సమావేశాల్లో నన్ను టార్గెట్ చేస్తూ కృనాల్ దూషిస్తున్నాడు. నేను ఒక సీనియర్ ఆటగాడినే. భారత్ జట్టుతో పాటు ఐపీఎల్లోనూ పలు జట్లకు ప్రాతినిధ్యం వహించాను. గతంలో ఇదే బరోడా జట్టకు కెప్టెన్గా పనిచేసిన నేను ఇప్పుడు వైస్ కెప్టెన్ హోదాలో ఏదైనా సలహా ఇచ్చినా కృనాల్ దానిని స్వీకరించడం లేదు' అని పేర్కొన్నాడు.
ఎలా ఆడతావో చూస్తా అంటూ:
తనను కనీసం ప్రాక్టీస్ కూడా చేసుకోనివ్వడం లేదని దీపక్ హుడా ఆరోపించాడు. 'హెడ్ కోచ్ ప్రభాకర్ అనుమతితో నేను నెట్స్లో ప్రాక్టీస్ చేస్తున్నాను. కానీ కృనాల్ వచ్చి నాతో అనుచితంగా ప్రవర్తించాడు. నేను కెప్టెన్ను.. కోచ్ ఎవరు?. నేను బరోడా టీమ్ కంటే ఎక్కువ అంటూ దాదాగిరి చేసి నన్ను ప్రాక్టీస్ చేయనీయకుండా అడ్డుకున్నాడు' అని ఈ మెయిల్లో హుడా తెలిపాడు. బరోడా టీమ్కు ఎలా ఆడతావో చూస్తా అంటూ కూడా పాండ్యా బెదిరిస్తున్నాడని కూడా చెప్పాడు. ఇప్పటి వరకూ తాను 7 ఐపీఎల్ సీజన్లు ఆడానని, ఎప్పుడూ ఇలాంటి అనారోగ్యకరమైన వాతావరణం చూడలేదని హుడా ఆవేదన వ్యక్తం చేశాడు.
రిపోర్ట్ ఇవ్వాల్సిందిగా:
అయితే వీరిద్దరి గొడవపై ఒక రిపోర్ట్ ఇవ్వాల్సిందిగా బరోడా టీమ్ మేనేజర్ని బరోడా క్రికెట్ అసోసియేషన్ కోరింది. కృనాల్ పాండ్యా టీమిండియాకి ఆడుతున్నాడు. 2018లో భారత్ తరఫున టీ20ల్లోకి ఎంట్రీ ఇచ్చిన పాండ్యా.. ఇప్పటి వరకూ 18 టీ20 మ్యాచ్లు ఆడాడు. ఇక దీపక్ హుడా 2017-18లో టీమిండియా టీ20 జట్టులోకి ఎంపికయ్యాడు. కానీ తుది జట్టులో మాత్రం అవకాశం దక్కించుకోలేకపోయాడు. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరఫున పాండ్యా.. కింగ్స్ ఎలెవన్ పంజాబ్కి హుడా ఐపీఎల్ 2020 సీజన్లో ఆడారు. క్యాంప్ నుంచి వెళ్లిపోయిన హుడా.. మళ్లీ బబులోకి రావాలంటే 14 రోజుల క్వారంటైన్ తప్పనిసరి.
38 జట్లు.. ఆరు గ్రూపులు:
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీకి ఈరోజే ప్రారంభం అయింది. ఐపీఎల్ 2021 సీజన్కు ముందు వచ్చే నెలలో ఆటగాళ్ల వేలం ఉండబోతున్న నేపథ్యంలో.. ఈ టోర్నీలో సత్తాచాటి ఫ్రాంఛైజీల దృష్టిలో పడాలని కొందరు కుర్రాళ్లు పట్టుదలతో ఉన్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో ప్రత్యేక బబుల్ వాతావరణం ఏర్పాటు చేసి.. బీసీసీఐ మ్యాచ్లు నిర్వహింస్తోంది. లీగ్ దశ మ్యాచ్లు ముంబై, వడోదర, ఇండోర్, కోల్కతా, చెన్నై, బెంగళూరులో జరగనున్నాయి. నాకౌట్ మ్యాచ్లకు అహ్మదాబాద్ ఆతిథ్యమివ్వనుంది. 38 జట్లను ఆరు (అయిదు ఎలైట్, ఓ ప్లేట్) గ్రూపులుగా విభజించి మ్యాచ్లు నిర్వహించనున్నారు.
Sydney Test: బుమ్రా చేసిన ఆ పనికి.. ఆశ్చర్యపోయిన అంపైర్!! ఏం చేయలేక రెండు చేతులు..! (వీడియో)