హైదరాబాద్: ఐపీఎల్లో భాగంగా ఈడెన్గార్డెన్స్ వేదికగా ఢిల్లీ వర్సెస్ కోల్కతా మ్యాచ్లో కోల్కతా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. నైట్ రైడర్స్ బ్యాట్స్మెన్ ఆండ్రీ రసెల్ 12 బంతుల్లో (41), నితీష్ రాణా 35 బంతుల్లో( 59) మెరుపు బ్యాటింగ్ చేశారు. వీరిద్దరూ సిక్స్లు, ఫోర్లతో చెలరేగారు. ముఖ్యంగా రసెల్ అయితే షమీ లక్ష్యంగా సిక్సర్ల మోత మోగించాడు. షమీ వేసిన ఇన్నింగ్స్ 15వ ఓవర్ తొలి బంతికి సింగిల్ తీసి ఖాతా తెరిచిన రసెల్ ఆ ఓవర్లో మూడు సిక్స్లు బాదాడు. దీంతో ఒకే ఓవర్లో షమీ 22 పరుగులు సమర్పించుకున్నాడు.
షమీ తర్వాతి ఓవర్లనూ రసెల్ అదే దూకుడు కనబరిచాడు. తొలి బంతిని సిక్స్గా మలిచిన రసెల్.. చివరి రెండు బంతుల్ని కూడా అదే తరహాలో ఆడాడు. దీంతో ఆ ఓవర్లో షమీ 20 పరుగులు ఇచ్చుకున్నాడు. షమీ బౌలింగ్ను ఊచకోత కోసిన రసెల్ 12 బంతుల్లోనే 41 పరుగులు చేసి అవుటయ్యాడు. ఐపీఎల్ ఇన్నింగ్స్లో ఒకే బౌలర్ లక్ష్యంగా అత్యధిక సిక్స్లు కొట్టిన ఆటగాళ్ల సరసన రసెల్ చేరాడు.
2016లో కరియప్ప బౌలింగ్లో 14 బంతులు ఎదుర్కొన్న విరాట్ కోహ్లి ఆరు సిక్స్లు బాదగా.. మొన్నామధ్య చెన్నైతో జరిగిన మ్యాచ్లో బ్రావో బౌలింగ్లో రసెల్ (14 బాల్స్) ఆరు సిక్స్లు కొట్టాడు. ఢిల్లీతో మ్యాచ్లోనైతే షమీ బౌలింగ్లో 9 బంతుల్లోనే ఆరు సిక్స్లు కొట్టడం విశేషం. రసెల్ దెబ్బకు షమీ 4 ఓవర్లలో 53 పరుగులు ఇచ్చుకున్నాడు. అందులో రసెల్ ఒక్కడే 40 పరుగులు చేయడం గమనార్హం. రసెల్ క్రీజులోకి రాకముందు 15 బంతుల్లో షమీ కేవలం 12 రన్స్ మాత్రమే ఇచ్చాడు. షమీ సొంత మైదానంలో రసెల్ అతడి బౌలింగ్ను ఊచకోత కోయడం బాధాకరం.
తొలి మెయిడిన్ ఓవర్:
కెప్టెన్ నిర్ణయానికి న్యాయం చేకూరుస్తూ.. ట్రెంట్ బౌల్ట్ తొలి ఓవర్ను మెయిడిన్ చేశాడు. బౌల్ట్ ఓవర్లో హిట్టర్ క్రిస్ లిన్ కనీసం ఒక్క పరుగు కూడా చేయలేకపోయాడు. ఈ ఐపీఎల్లో ఇదే తొలి మెయిడిన్ ఓవర్ కావడం విశేషం. మరుసటి ఓవర్లో బౌల్ట్ షార్ట్ బాల్తో నరైన్ను బోల్తా కొట్టించాడు.
నరైన్ నిరాశతో పెవిలియన్కు:
ఎత్తులో వచ్చిన బంతిని నరైన్ హిట్ చేసే ప్రయత్నం చేయగా.. అది టాప్ ఎడ్జ్ తీసుకొని కీపర్ వైపు వెళ్లింది. పంత్ ఎగిరి అందుకునే ప్రయత్నం చేశాడు. కానీ బంతి మరీ ఎత్తులో రావడంతో అది అతడి గ్లోవ్స్ను తాకుతూ గాల్లోకి ఎగరగా.. పక్కనే ఉన్న మ్యాక్స్వెల్ పరిగెత్తుకొచ్చి క్యాచ్ అందుకున్నాడు. నరైన్ (1) నిరాశతో పెవిలియన్ చేరగా.. ఢిల్లీ ఖాతాలో తొలి వికెట్ చేరింది.