దుబాయ్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2020 సీజన్లో భాగంగా కింగ్స్ పంజాబ్తో జరుగుతున్న మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాట్స్మన్ మార్కస్ స్టోయినిస్( 21 బంతుల్లో 7ఫోర్లు, 3 సిక్స్లతో 53 ) ఫాస్టెస్ట్ ఫిఫ్టీతో చెలరేగాడు. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 157 పరుగులు చేసింది. టాపార్డర్ విఫలమవడంతో ఓ దశలో 120 పరుగులకే పరిమితం అవుతుందనుకున్న ఢిల్లీ .. స్టోయినిస్ ధాటైన ఇన్నింగ్స్తో ప్రత్యర్థి ముందు పోరాడే లక్ష్యాన్నిఉంచింది. శ్రేయస్ అయ్యర్( 32 బంతుల్లో 3 సిక్సర్లతో 39), రిషభ్ పంత్(29 బంతుల్లో 4 ఫోర్లతో 31) పర్వాలేదనిపించారు. పంజాబ్ బౌలర్లలో మహ్మద్ షమీ(3/15) మూడు వికెట్లు తీయగా.. షెల్డన్ కాట్రెల్ రెండు, రవి బిష్ణోయ్ ఒక వికెట్ పడగొట్టారు. ఐపీఎల్లో షమీకిదే బెస్ట్ పెర్ఫామెన్స్.
టాస్ ఓడి బ్యాటింగ్ చేపట్టిన ఢిల్లీ క్యాపిటల్స్కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. ఆ జట్టు ఓపెనర్ శిఖర్ ధావన్(0) అనవసర పరుగుకు ప్రయత్నించి రనౌట్గా పెవిలియన్ చేరాడు. ఆ వెంటనే మహ్మద్ షమీ.. మరో ఓపెనర్ పృథ్వీ షా(5), ఫస్ట్ డౌన్ బ్యాట్స్మన్ షిమ్రన్ హెట్మైర్(7)లను ఒకే ఓవర్లో క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చి ఢిల్లీని కోలుకోని దెబ్బతీసాడు. దీంతో ఢిల్లీ 4 ఓవర్లలో 13 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన రిషభ్ పంత్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ నిదానంగా ఆడుతూ ఇన్నింగ్స్ను ముందుకు నడిపించారు. జోర్గాన్ వేసిన 5వ ఓవర్ నాలుగో బంతిని బౌండరీకి తరలించి పంత్ టచ్లోకి వచ్చాడు. ఇక కృష్ణప్ప గౌతమ్ వేసిన 9వ ఓవర్లో పంత్ ఫోర్, శ్రేయస్ అయ్యర్ భారీ సిక్సర్ కొట్టడంతో 13 పరుగులు వచ్చాయి. అనంతరం ఓపికగా ఆడిన ఈ జోడీ సింగిల్స్, డబుల్స్ తీస్తూ రన్రేట్ తగ్గకుండా జాగ్రత్తపడింది.
ఇక గౌతమ్ వేసిన 13 ఓవర్లో అయ్యర్ వరుసగా రెండు సిక్స్లు కొట్టి 15 రన్స్ పిండుకున్నాడు. ఢిల్లీ ఇన్నింగ్స్ గాడిలో పడుతుందనగా రిషభ్ పంత్ను.. అండర్ 19 క్రికెటర్ రవి బిష్ణోయ్ క్లీన్ బౌల్డ్ చేయడంతో నాలుగో వికెట్కు నమోదైన 73 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆ మరుసటి ఓవర్లోనే శ్రేయస్ అయ్యర్ కూడా ఔటవ్వడంతో ఢిల్లీ స్కోర్ మందగించింది. క్రీజులోకి వచ్చిన అక్సర్ పటేల్ (6), రవిచంద్రన్ అశ్విన్ (4) కూడా విఫలమయ్యారు.
చివర్లో స్టోయినిస్ ధాటిగా ఆడటంతో ఢిల్లీ గౌరవప్రదమైన స్కోర్ చేయగలిగింది. క్రిస్ జోర్డాన్ వేసిన ఆఖరి ఓవర్(6 Wd 4 4 4 6 WN1 3)లో మార్కస్ స్టోయినిస్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఐదో బంతికి రనౌట్ అయినా నోర్జ్ ఆఖరి బంతికి మూడు పరుగులు తీయడంతో ఈ ఓవర్లో మొత్తం 30 పరుగులు వచ్చాయి. ఇక చివరి మూడు ఓవర్లలోనే ఢిల్లీ 57 పరుగులు చేయడం గమనార్హం.
అంబటి రాయుడికి అన్యాయం చేశారు: హర్భజన్ సింగ్