
సౌతాంప్టన్: ఆస్ట్రేలియాతో ఆదివారం జరిగిన రెండో టీ20 ఇంగ్లండ్ 6 వికెట్ల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. ఫలితంగా మూడు టీ20ల సిరీస్ను మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0తో కైవసం చేసుకుంది. అయితే ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాట్స్మన్ డేవిడ్ వార్నర్ను ఇంగ్లండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్ భయపెట్టాడు. తన రాకాసి బౌన్సర్లతో బెంబేలెత్తించాడు. అతని బౌలింగ్ను ఆడలేకపోయిన వార్నర్.. మూడు బంతులకే చెతులెత్తేసి డకౌట్గా పెవిలియన్కు చేరాడు.
అయితే ఆర్చర్ వేసిన మూడో బంతి వార్నర్ మీదకు దూసుకొచ్చింది. భుజాన్ని తాకుతూ కీపర్ జోస్ బట్లర్ చేతిలో పడింది. ఈ దెబ్బకు వార్నర్ 'ఓ జీసస్' అంటూ గట్టిగా అరిచాడు. ఇది స్టంప్ మైక్స్లో రికార్డు అయింది. ఇక ఇంగ్లండ్ ఆటగాళ్లు అప్పీల్ చేయగా.. ఫీల్డ్ అంపైర్ ఔట్ ఇచ్చాడు. భుజానికి తగిలిందంటూ ఈ నిర్ణయంపై సమీక్ష వెళ్లిన వార్నర్ భంగపడ్డాడు. గ్లౌవ్స్ను రుద్దుకుంటూ బంతి కీపర్ చేతిలో పడినట్లు టీవీ రిప్లేలో స్పష్టమైంది. దీంతో వార్నర్ భారంగా మైదానాన్ని వీడాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది.
ఇక ఫస్ట్ టీ20లో 58 పరుగులతో రాణించిన వార్నర్.. రెండో టీ20లో మాత్రం దారుణంగా విఫలమయ్యాడు. ఇక ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 157 పరుగులు చేసింది. కెప్టెన్ ఆరోన్ ఫించ్ (33 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్లతో 40), స్టొయినిస్ (26 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లు 35) రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ జోర్డాన్ 2 వికెట్లు పడగొట్టగా... ఆర్చర్, మార్క్వుడ్ చెరో వికెట్ తీశారు.
అనంతరం లక్ష్యఛేదనకు దిగిన ఇంగ్లండ్ 18.5 ఓవర్లలో నాలుగే వికెట్లు కోల్పోయి 158 పరుగులు చేసి నెగ్గింది. ఓపెనర్ బట్లర్(77 నాటౌట్) కడదాకా క్రీజులో నిలబడి గెలిపించగా.. డేవిడ్ మలన్ (32 బంతుల్లో 7 ఫోర్లు 42) రాణించాడు. ఆసీస్ బౌలర్లలో అగర్కు 2 వికెట్లు దక్కాయి. ఆఖరి టీ20 రేపు (మంగళవారం) సౌతాంప్టన్ వేదికగా జరుగుతుంది.