తనవల్లే ఓడిపోయామంటూ డికాక్ నాకు క్షమాపణలు చెప్పాడు: మిల్లర్

గౌహతి: బౌండరీల మోత.. సిక్సర్ల జాతరగా సాగిన రెండో టీ20లో భారత్ ఉత్కంఠ విజయం సాధించింది. భారీ లక్ష్య చేధనలో డేవిడ్ మిల్లర్(47 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్సర్లతో 106 నాటౌట్), క్వింటన్ డికాక్(48 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 69 నాటౌట్) ఆఖరి బాల్ వరకు వణికించినా.. 16 పరుగులతో గట్టెక్కింది. అయితే ఈ మ్యాచ్లో డికాక్ నెమ్మదైన బ్యాటింగ్ ఆ జట్టు కొంపముంచింది. బ్యాటింగ్కు పూర్తిగా అనుకూలమైన పిచ్పై డికాక్.. స్వేచ్చగా షాట్లు ఆడలేకపోయాడు.
మ్యాచ్ అసాంతం అసౌకర్యంగా కనిపించాడు. అక్షర్ పటేల్ బౌలింగ్లో భారీ షాట్లు ఆడినా.. జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఈ క్రమంలోనే మ్యాచ్ ముగిసిన అనంతరం సెంచరీ హీరో మిల్లర్ దగ్గరకు వెళ్లి డికాక్ క్షమాపణలు చెప్పాడు. ఈ విషయం పోస్ట్ మ్యాచ్ ప్రజంటేషన్లో మిల్లర్ వెల్లడించాడు. ఆటలో ఇవన్నీ సహజమని డికాక్కు మద్దతు తెలిపాడు.

క్షమాపణలు చెప్పాడు
'ఆరంభంలో క్వింటన్ డికాక్ ఇబ్బంది పడ్డ మాట వాస్తవమే. కానీ అతను తన బ్యాటింగ్కు మాకు విజయవకాశాలు కల్పించాడు. ఫోర్లు, సిక్స్లు అలవోకగా బాదగల సామర్థ్యం అతనికి ఉంది. కానీ సెట్ అయ్యేందుకు కాస్త టైమ్ తీసుకున్నాడు. ఈ మ్యాచ్లో మేం కేవలం 16 పరుగులే తక్కువ చేశాం. మ్యాచ్ అనంతరం డికాక్ నా దగ్గరకు వచ్చి క్షమాపణలు చెప్పాడు. 'బాగా ఆడావు. నావల్లే విజయాన్నందుకోలేకపోయాం.
ఐయామ్ సారీ'అంటూ చెప్పాడు. ఇక ఇది బ్యాటింగ్కు అనుకూలమైన వికెట్. కానీ ప్రారంభంలో భారత్ మమ్మల్ని ఒత్తిడిలో నెట్టింది. మేం తొలి బంతి నుంచే ధాటిగా ఆడాల్సింది. ఇక్కడ వర్షాలు పడుతుండటంతో ఉక్కపోతగా ఉంది. ఎంతలా అంటే నీళ్లు తప్పా మరేం తీసుకోలేని పరిస్థితి ఉంది.'అంటూ మిల్లర్ చెప్పుకొచ్చాడు.

దుమ్మురేపిన సూరీడు..
టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 237 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్(22 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స్లతో 61) ఆకాశమే హద్దుగా చెలరేగగా.. కేఎల్ రాహుల్(28 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్లతో 57), విరాట్ కోహ్లీ(28 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్తో 49 నాటౌట్), రోహిత్ శర్మ(37 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్తో 43) కీలక ఇన్నింగ్స్ ఆడారు. సౌతాఫ్రికా బౌలర్లలో కేశవ్ మహరాజ్ ఒక్కడే రెండు వికెట్లు తీయగా.. మిగతా బౌలర్లు దారుణంగా విఫలమయ్యారు. పోటీపడి మరీ పరుగిలిచ్చారు.

వణికించిన మిల్లర్..
అనంతరం లక్ష్యచేధనకు దిగిన సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 221 పరుగులే చేసింది. డేవిడ్ మిల్లర్(47 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్స్లతో 106 నాటౌట్) అజేయ సెంచరీతో చెలరేగగా.. క్వింటన్ డికాక్(48 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్లతో 69 నాటౌట్) హాఫ్ సెంచరీతో రాణించాడు. ఈ ఇద్దరు నాలుగో వికెట్కు అజేయంగా 174 పరుగులు జోడించారు. భారత్కు విజయానందమే లేకుండా చేశారు. భారత బౌలర్లలో అర్ష్దీప్ సింగ్ 2 వికెట్లు తీసినా... 62 పరుగులు సమర్పించుకున్నాడు. అక్షర్ పటేల్ ఓ వికెట్ పడగొట్టాడు. దీపక్ చాహర్(0/24) మినహా అంతా ధారళంగా పరుగులిచ్చారు. మూడో టీ20 మంగళవారం ఇండోర్ వేదికగా జరగనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications