బర్మింగ్హామ్: కామన్వెల్త్ గేమ్స్లో భారత మహిళల క్రికెట్ జట్టుకు శుభారంభం దక్కలేదు. తొలిసారి మహిళల క్రికెట్ అవకాశం కల్పించగా.. తొలి మ్యాచ్లో ఆస్ట్రేలియాతో భారత్ తలపడింది. ఆసాంతం రసవత్తరంగా సాగిన ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా మహిళల జట్టు మూడు వికెట్లతో విజయాన్నందుకుంది. అయితే ఈ మ్యాచ్లో టీమిండియా స్టార్ ఓపెనర్ షెఫాలీ వర్మ స్టంపౌట్ నాటౌట్ ఇవ్వకపోవడం చర్చనీయాంశమైంది. భారత ఇన్నింగ్స్ సందర్భంగా 65/1 స్కోర్ సమయంలో షెఫాలీ వర్మ స్టంపౌట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకుంది.
తాలిమా మెగ్రాత్ బౌలింగ్లో షెఫాలీ ముందుకొచ్చి ఆడేందుకు ప్రయత్నించగా.. బాల్ బీట్ అయ్యి కీపర్ అలిస్సా హేలీ చేతిలో పడింది. అయితే, వెంటనే స్పందించిన కీపర్.. వికెట్లను గిరాటేసి గట్టి అప్పీల్ చేసింది. దాంతో ఫీల్డ్ అంపైర్ థర్డ్ అంపైర్ సమీక్ష కోరాడు. రివ్యూలు పరిశీలించిన థర్డ్ అంపైర్ నాటౌట్ ఇచ్చాడు. క్రీజుకు ఫీట్ దూరంలోనే షెఫాలీ నిలిచిపోయినా ఔటివ్వకపోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది.
అయితే వికెట్ కీపర్ అలిస్సా హేలీ తప్పిదం కారణంగానే అంపైర్ ఔట్ ఇవ్వలేదనే విషయం అర్థమైంది. నిబంధనల ప్రకారం బంతి చేతిలో పట్టుకొని వికెట్లను గిరాటేయాలి. కానీ హేలీ మాత్రం ఎడమ చేతితో బంతిని పట్టుకొని కుడిచేతితో స్టంప్ను గిరాటేసింది. ఈ విషయాన్ని గ్రహించిన థర్డ్ అంపైర్ నిబంధనల మేరకు నాటౌట్ ప్రకటించాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన హర్మన్ప్రీత్ కౌర్ సారథ్యంలో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 154 పరుగులు చేసింది. కెప్టెన్ హర్మన్ప్రీత్ (34 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్తో 52) హాఫ్ సెంచరీ చేయగా.. షెఫాలీ వర్మ(33 బంతుల్లో 9 ఫోర్లతో 48) తృటిలో హాఫ్ సెంచరీ చేజార్చుకుంది.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఆస్ట్రేలియా 19 ఓవర్లలో 7 వికెట్లకు 155 పరుగులు చేసి విజయం సాధించింది. భారత బౌలర్ రేణుకాసింగ్ ధాటికి 49 పరుగులకే 5వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన ఆసీస్ను ఆష్లీ గార్డ్నెర్ (52 నాటౌట్), గ్రేస్ హ్యారీస్ (37) ఆదుకున్నారు. స్వల్ప స్కోరుకే 5వికెట్లు తీసిన అనంతరం భారత్ విజయం లాంఛనమే అని భావించగా.. ఆ అవకాశాలకు ఈ ఇరువురు గండికొడుతూ ఆ జట్టును విజయ తీరాలకు చేర్చారు. భారత బౌలర్లలో రేణుక సింగ్కు తోడుగా దీప్తి శర్మ రెండు వికెట్లు తీయగా.. మేఘన సింగ్ ఓ వికెట్ పడగొట్టింది. భారత్ తమ తదుపరి మ్యాచ్ను ఆదివారం పాకిస్థాన్తో ఆడనుంది.