చిరకాల ప్రత్యర్థి భారత్పై గెలిచేందుకు సర్వశక్తులా ప్రయత్నిస్తాం అని పాకిస్థాన్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ అన్నారు. బుధవారం ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో పాకిస్థాన్ 41 పరుగుల తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. మ్యాచ్ అనంతరం సర్ఫరాజ్ మీడియా సమావేశంలో మాట్లాడాడు.
ఐసీసీ క్రికెట్ వరల్డ్కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
'ఈ ఓటమి మమ్మల్ని నిరాశపరిచింది. కేవలం 15 బంతుల వ్యవధిలో మూడు వికెట్లు కోల్పోవడం మ్యాచ్పై ప్రభావం చూపింది. ఓడిపోయినా కూడా మాకు కొన్ని సానుకూలాంశాలు ఉన్నాయి. హసన్ అలీ, వహాబ్ రియాజ్లు బాగా బ్యాటింగ్ చేశారు. చివరి వరకు పోరాడినా విజయం సాదించలేకపోయాం. అమిర్ తప్ప మిగతా బౌలర్లు రాణించలేదు. ఇది 270-80 పిచ్. కానీ మేము ఇంకా 30 పరుగులు ఎక్కువే ఇచ్చాం. ఛేదనలో టాప్ నలుగురు బ్యాట్స్మన్ రాణించాలి. వారు పరుగులు చేసినా.. పెద్ద స్కోర్లు సాధించడంలో విఫలమయ్యారు. భారత్, పాక్ మ్యాచ్ చాలా పెద్ద మ్యాచ్. భారత్పై గెలిచేందుకు సర్వశక్తులా ప్రయత్నిస్తాం' అని సర్ఫరాజ్ తెలిపారు.
మరో మూడు రోజుల్లో భారత్, పాక్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం ఇరుదేశాల అభిమానులే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది క్రికెట్ ప్రేమికులు ఎదురుచూస్తున్నారు. 2008 ఉగ్రదాడుల అనంతరం ఇరు జట్ల మధ్య క్రికెట్ సంబంధాలు దెబ్బతిన్న విషయం తెలిసిందే. అప్పటి నుంచీ ఐసీసీ టోర్నమెంట్లలోనే తలపడుతున్నాయి. చివరిసారి 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో తలపడగా.. పాక్ 180 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. అయితే ఐసీసీ ప్రపంచకప్లలో మాత్రం భారత్తో తలపడిన ఆరు మ్యాచ్ల్లోనూ పాక్ ఓటమిపాలైంది. దీంతో ఆదివారం జరగబోయే మ్యాచ్లో గెలవాలని ఇరు జట్లూ పట్టుదలగా ఉన్నాయి. దీంతో మ్యాచ్ రసవత్తరంగా సాగే అవకాశం ఉంది.