ఇంగ్లాండ్ ఇంటికా? సెమీస్కా?
ఇందులో ఇంగ్లాండ్కే ఎక్కువ ప్రమాదం పొంచి ఉంది. టోర్నలో భాగంగా ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టు తన తదుపరి మ్యాచ్ల్లో భారత్, న్యూజిలాండ్తో తలపడాల్సి ఉంది. ఈ రెండు జట్లు టోర్నీలో అద్భుత విజయాలను నమోదు చేశాయి. టీమిండియా ఒక్క మ్యాచ్లో కూడా ఓడిపోకుండా సెమీస్ దిశగా అడుగులు వేస్తుంటే, కివీస్ ఆడిన ఏడు మ్యాచ్ల్లో కేవలం ఒకదాంట్లో మాత్రమే ఓడింది. మరోవైపు ఇంగ్లాండ్ ఆడిన ఏడు మ్యాచ్ల్లో మూడు మ్యాచ్ల్లో ఓడి తీవ్ర ఒత్తిడిలో ఉంది. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్ ఈ రెండు జట్లను ఎలా ఎదుర్కొంటుందోనన్నది ఆసక్తికరంగా మారింది. సొంత గడ్డపై తొలిసారి టైటిల్ గెలవాలన్న ఇంగ్లాండ్ కల ఈసారైనా నెరవేరుతుందో లేదో చూడాలి మరి. ఇప్పటివరకు ఏడు మ్యాచ్లాడిన ఇంగ్లాండ్ జట్టు 8 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. మరోవైపు బంగ్లాదేశ్, పాకిస్థాన్ కూడా చెరో ఏడు మ్యాచ్లు ఆడి, చెరో 7 పాయింట్లతో పాయింట్ల పట్టికలో వరుసగా ఐదు, ఆరు స్థానాల్లో కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్ ఆడే రెండు మ్యాచ్లకు వరుణుడు అంతరాయం కలిగిస్తే ఇంగ్లాండ్ జట్టు పరిస్థితి అంతే మరి.
సెమీస్కు చేరిన తొలి జట్టుగా ఆస్ట్రేలియా
ఈ ప్రపంచకప్లో టీమిండియా వరుస విజయాలతో దూసుకుపోతుంది. వరుస విజయాలతో సెమీస్ బెర్తు దాదాపు ఖారారు చేసుకుంది. టీమిండియా ఇంకా ఈ ప్రపంచకప్లో మూడు మ్యాచ్లు ఆడాల్సి ఉంది. ఈ మూడింటలో ఏ ఒక్క మ్యాచ్ గెలిచినా కోహ్లీసేన సెమీస్కు చేరుతుంది. వెస్టిండీస్పై విజయంతో భారత్ సెమీస్కు మరింత చేరువకాగా విండీస్ నాకౌట్ రేసు నుంచి నిష్క్రమించింది. గత, బుధవారం ఇంగ్లాండ్పై 64 పరుగుల తేడాతో గెలుపొందిన ఆస్ట్రేలియా సెమీఫైనల్కు క్వాలిఫై అయిన తొలి జట్టుగా నిలిచింది. మరోవైపు న్యూజిలాండ్ కూడా 11 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. టోర్నీలో ఇంకా రెండు మ్యాచ్లాడాల్సి ఉన్నప్పటికీ..ర న్రేట్ కూడా మెరుగ్గా ఉండటంతో న్యూజిలాండ్కు దాదాపుగా సెమీస్కు చేరినట్టే.
నాలుగో స్థానం కోసం నాలుగు జట్లు
నాలుగో స్థానం కోసం ఇంగ్లాండ్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, శ్రీలంక రేసులో ఉన్నాయి. పాక్ తన తదుపరి మ్యాచ్ల్లో అఫ్గనిస్థాన్, బంగ్లాదేశ్తో పోటీపడాల్సి ఉంది. ఈ రెండు జట్లపై పాకిస్థాన్ విజయం సాధిస్తే దాని ఖాతాలో 11 పాయింట్లు చేరతాయి. మరోవైపు శ్రీలంక ఇప్పటి వరకు 6 మ్యాచ్లే ఆడి 6 పాయింట్లతో ఉంది. తన మిగతా మ్యాచ్ల్లో భారత్, వెస్టిండీస్ లాంటి బలమైన జట్లతో పోటీపడాల్సి ఉంది. వీటిలో ఏ ఒక్క దాంట్లో ఓడినా సెమీస్ అవకాశం చేజారినట్లే. ఇంగ్లాండ్తో పోలిస్తే పాకిస్థాన్కే సెమీస్కు చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలా కాకుండా ఇంగ్లాండ్ తన తదుపరి రెండు మ్యాచ్ల్లో విజయం సాధిస్తే నేరుగా టాప్-4కు చేరుకుంటుంది.
దక్షిణాఫ్రికా-శ్రీలంక మ్యాచ్ ఫలితం కూడా ప్రభావం
శుక్రవారం శ్రీలంక-దక్షితాఫ్రికా జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ ఫలితంతో సెమీస్పై పూర్తి స్పష్టత రానుంది. ఈ మ్యాచ్లో శ్రీలంక ఓడితే సెమీస్ అవకాశాలు సంక్లిష్టం అవుతాయి. శ్రీలంక నాలుగు మ్యాచ్ల్లో రెండింటిలో గెలుపొంది.. రెండింటిలో ఓడిపోయింది. వర్షం కారణంగా రెండు మ్యాచ్లు రద్దుకావడంతో 6 పాయింట్లతో ఏడో స్థానంలో కొనసాగుతోంది. నాకౌట్కు చేరాలంటే లంక తమ చివరి మూడు మ్యాచ్ల్లో తప్పక గెలవాల్సిందే. దీంతో సౌతాఫ్రికాపై నెగ్గి సెమీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలని కరుణరత్నే సేన గట్టి పట్టుదలగా ఉంది.