ఢాకా : బంగ్లాదేశ్ దేశవాళీ మ్యాచ్లో బ్యాట్స్మెన్ బౌండరీల సునామీ సృష్టించారు. 48 సిక్సర్లు, 70 ఫోర్లతో వీరవిహారం చేశారు. ఢాకా వేదికగా జరిగిన ఈ పరుగుల పండుగను చూసి యావత్ క్రికెట్ ప్రపంచం నివ్వెరపోతుంది. అత్యంత అరుదైన ఈ సంఘటన సెకండ్ డివిజన్ స్థాయిలో నార్త్ బెంగాల్ క్రికెట్ అకాడమీ, టాలెంట్ హంట్ క్రికెట్ అకాడమీ మధ్య జరిగిన వన్డే మ్యాచ్లో చోటు చేసుకుంది. ఈ బౌండరీల సునామీతో ఈ మ్యాచ్లో ఏకంగా 818 పరుగులు నమోదయ్యాయి.
ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన నార్త్ బెంగాల్ టీమ్ నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల కోల్పోయి 432 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం ఛేజింగ్కు దిగిన టాలెంట్ హంట్ టీమ్.. గట్టి పోటీనిచ్చినా.. ఆఖరికి 386/7కే పరిమితమైంది. దీంతో నార్త్ బెంగాల్ క్రికెట్ అకాడమీ 46 పరుగులతో గెలుపొందింది. మ్యాచ్లో మొత్తం 48 సిక్సర్లు నమోదవ్వగా.. ఇందులో నార్త్ బెంగాల్ 27, టాలెంట్ హంట్ టీమ్ 21 సిక్సర్లు కొట్టింది.
కోహ్లీ మరో 25 పరుగులు చేస్తే ధోని రికార్డు బద్దలు..
'ఇది అసాధారణం. గత కొన్నేళ్లుగా ఢాకా దేశవాళీ క్రికెట్తో నాకు సంబంధం ఉంది. కానీ ఇలాంటి మ్యాచ్ను ఎప్పుడూ చూడలేదు.' అని క్లబ్ ఆర్గనైజర్ సయ్యద్ అలీ అసఫ్ తెలిపాడు. అయితే బంగ్లాదేశ్ డొమెస్టిక్ క్రికెట్లో ఈ తరహా అసాధారణ ఫలితాలు తరుచూ చోటుచేసుకుంటూ ఉంటాయి. మ్యాచ్ ఫిక్సింగ్ కూడా ఎక్కువగా జరుగుతుంటుంది. 2017లో బంగ్లాదేశ్కు చెందిన ఓ బౌలర్ ఒకే ఓవర్లో ఏకంగా 92 పరుగులు సమర్పించుకుని 10 ఏళ్ల నిషేధానికి గురయ్యాడు.
అతను అంపైర్ నిర్ణయంపై కోపంతో తొలి ఓవర్లోనే 13 వైడ్లు, మూడు నోబాల్స్ విసిరాడు. ఈ బంతుల్ని కీపర్ పట్టకపోవడంతో అన్నీ ఫోర్లుగా వెళ్లాయి. దీంతో.. ఆ ఓవర్లో ఏకంగా అతను 92 పరుగుల్ని సమర్పించుకున్నాడు. క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా బౌలింగ్ చేసిన ఆ బౌలర్పై అప్పట్లో బీసీబీ పదేళ్ల నిషేధం విధిస్తూ చర్యలు తీసుకుంది.