కేప్టౌన్: క్రికెట్ సౌతాఫ్రికా(సీఎస్ఏ) అతిపెద్ద సంక్షోభంలో చిక్కుకుంది. సౌతాఫ్రికా క్రికెట్ టీమ్ ఉనికికే ప్రమాదం వచ్చే పరిస్థితి ఏర్పడింది. సౌతాఫ్రికా ప్రభుత్వం తనకున్న అధికారాన్ని వినియోగించుకుని సీఎస్ఏ కార్యకలాపాల్లో జోక్యం చేసుకునేందుకు సిద్దం అయ్యింది. ఈ మేరకు క్రికెట్ బోర్డుకు ఓ నోటీసు పంపింది. దాని ప్రకారం సీఎస్ఏలో సమస్యల పరిష్కారానికి బోర్డు సభ్యులు ఏకాభిప్రాయానికి రాకుంటే స్పోర్ట్స్ మినిస్ట్రీ తుది నిర్ణయం తీసుకుంటుంది.
ఇది అమలైతే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ)లో సీఎస్ఏ స్థానం కోల్పోయే ప్రమాదముంది. అప్పుడు సౌతాఫ్రికా టీమ్ ఇంటర్నేషనల్ క్రికెట్కు దూరమవుతుంది.క్రికెట్ బోర్డు వ్యవహారాల్లో ప్రభుత్వాలు జోక్యం చేసుకోవడంలో గతంలోనూ ఐసీసీ పలు దేశాల సభ్యత్వాన్ని రద్దు చేసింది. అయితే, సౌతాఫ్రికా ప్రభుత్వ నిర్ణయానికి సంబంధించి సీఎస్ఏ నుంచి తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఐసీసీ శుక్రవారం తెలిపింది. నిజానికి, సీఎస్ఏలో వివాదాలు కొత్తేం కాదు.
అయితే, గత వారం జరిగిన మీటింగ్లో సీఎస్ఏ నూతన రాజ్యాంగాన్ని బోర్డు తాత్కలిక(ఇంటెర్మ్) సభ్యులు ఆమోదించలేదు. ప్రభుత్వం మద్దతు పలుకుతున్న ఈ రాజ్యాంగం తిరస్కరణకు గురికావడంతో స్పోర్ట్స్ మినిస్ట్రీ రంగంలోకి దిగింది. బోర్డులో ప్రభుత్వ జోక్యాన్ని సౌతాఫ్రికా ప్లేయర్లు కూడా వ్యతిరేకిస్తున్నారు. ఏదేమైనా సీఎస్ఏ ఇంటెర్మ్ బోర్డు, ప్రభుత్వంతో చర్చించి పరిస్థితిని చక్కదిద్దుకోకపోతే సౌతాఫ్రికా క్రికెట్ తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదు.