హైదరాబాద్: క్రికెట్లో బ్యాట్, బంతి మధ్య సమతూకం ఉండేలా చర్యలు తీసుకోవాలని దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్ సూచించాడు. వన్డేల్లో రెండు బంతుల వినియోగంపై ఇటీవల పెదవి విరిచిన సచిన్ టెండూల్కర్.. ఈ రూల్ క్రికెట్ వినాశనానికి దారితీస్తోందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ విషయంపై సచిన్.. ఇటీవల ప్రముఖ మీడియా సమావేశంలో పాల్గొన్నారు.
రెండు బంతుల వినియోగం నిబంధన 2011లో మీరు క్రికెట్ ఆడుతున్న రోజుల్లోనే వచ్చింది. మరి అప్పుడు కాకుండా.. ఇప్పుడు ఎందుకు ప్రశ్నిస్తున్నారు..? అని సచిన్ టెండూల్కర్ని అడగ్గా.. 'క్రికెట్ ఆడుతున్న రోజుల్లో రూల్స్ గురించి నేనెలా ప్రశ్నిస్తాను..? పాకిస్థాన్పై ఆరు రోజుల టెస్టు మ్యాచ్తో నా కెరీర్ని ప్రారంభించాను. ఆ టెస్టులో ఒక రెస్ట్ డే కూడా ఉండేది. ఆ తర్వాత వన్డే, టెస్టుల్లో చాలా రూల్స్ మారడం నేను చూశాను.'
'కానీ.. ఏ రోజూ వాటి గురించి నేను మాట్లాడలేదు. ఎందుకంటే.. అందరికీ వర్తించే నిబంధనలే నాకూ వర్తిస్తాయి కదా..? నువ్వు క్రికెట్ ఆడుతున్నప్పుడు.. రూల్స్ గురించి కామెంట్ చేయకూడదు. కానీ.. బ్యాట్, బంతి మధ్య సమతూకం ఉండాలని నేను కోరుకుంటున్నా' అని సచిన్ టెండూల్కర్ వెల్లడించాడు.
వన్డే మ్యాచ్లో ఒక ఇన్నింగ్స్లోనే రెండు బంతులు వినియోగించేలా ఐసీసీ.. 2011 అక్టోబరులో నిబంధనలను సవరించింది. దీని ప్రకారం.. మైదానంలోని ఇద్దరు ఫీల్డ్ అంపైర్ల వద్ద చెరొక బంతి ఉంటుంది. ఎవరైతే.. నాన్స్ట్రైక్ ఎండ్లో అంపైరింగ్కి వెళ్తారో.. వారి వద్ద ఉన్న బంతిని తీసుకుని బౌలర్ బౌలింగ్ చేస్తాడు. అంటే.. 50 ఓవర్లను ఒక్కో బంతితో 25 ఓవర్లు చొప్పున.. మొత్తం మ్యాచ్లో 4 బంతులను వినియోగిస్తారన్నమాట.