ఐపీఎల్ 2026 ప్రారంభానికి ముందు ముంబై ఇండియన్స్ జట్టును ఏబీ డివిలియర్స్ హెచ్చరించాడు. స్టార్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ను నమ్ముకుంటే ముంబై ఇండియన్స్ మునిగినట్టేనని అభిప్రాయపడ్డాడు. ఒకప్పటిలా బౌల్ట్ బౌలింగ్ చేయలేకపోతున్నాడని, అతని బౌలింగ్లో పదును తగ్గిందని తెలిపాడు.
ఐపీఎల్ 2026 సీజన్ టైటిలే లక్ష్యంగా ముంబై ఇండియన్స్ సిద్దమవుతోంది. చివరిసారిగా 2020లో టైటిల్ గెలిచిన ముంబైకి గత ఐదు సీజన్లలో నిరాశే ఎదురైంది. కనీసం ఈ సీజన్లోనైనా విజేతగా నిలిచి ఆరో టైటిల్ను ముద్దాడాలనే కసితో ఉంది. సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా, తిలక్ వర్మ వంటి స్టార్ ప్లేయర్లతో ముంబై ఇండియన్స్ డేంజరస్గా కనిపిస్తోంది.
అయితే ట్రెంట్ బౌల్ట్ ఫామ్ కోల్పోవడం ముంబైకి ఆందోళన కలిగించే అంశమని డివిలియర్స్ అభిప్రాయపడ్డాడు. తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా మాట్లాడిన డివిలియర్స్.. బౌల్ట్కు బ్యాకప్ పేసర్ను సిద్దం చేసుకోవాలని సూచించాడు. 'ముంబై ఇండియన్స్ విషయంలో నాకు ఉన్న ఒకే ఒక్క ఆందోళన ట్రెంట్ బౌల్ట్. అతని పరిస్థితి కూడా భువనేశ్వర్ కుమార్లానే ఉంది. బౌల్ట్ బౌలింగ్లో పదును తగ్గింది. ఒకప్పటి వేగం లేదు.

గతంలో అతను గంటకు 140 కిలోమీటర్ల వేగంతో బంతులను సంధించేవాడు. తన మణికట్టు వేగంతో బంతిని అద్భుతంగా స్వింగ్ చేసేవాడు. కానీ ఇటీవల సౌతాఫ్రికా టీ20 లీగ్లో అతని వేగం తగ్గడమే కాకుండా.. పరుగులు కూడా ఎక్కువగానే ఇచ్చాడు. బౌల్ట్ రూపంలో తమకు మంచి బౌలింగ్ ఆప్షన్ ఉందని ముంబై భావిస్తుండవచ్చు. కానీ అది ఒక భ్రమ మాత్రమే . ప్రత్యర్థి బ్యాటర్లు అతడిని టార్గెట్ చేసే అవకాశం ఉంది.'అని డివిలియర్స్ హెచ్చరించాడు.
ఇటీవల ముగిసిన SA20లో ముంబై ఇండియన్స్ కేప్ టౌన్ తరపున ఆడిన బౌల్ట్.. 10 మ్యాచ్ల్లో కేవలం 8 వికెట్లు మాత్రమే తీసి, 10 ఎకానమీతో పరుగులు సమర్పించుకున్నాడు. ఇన్నాళ్లూ బుమ్రాకు తోడుగా బౌల్ట్ అద్భుతంగా రాణించినా.. ఇప్పుడు ఆ పరిస్థితి ఉండకపోవచ్చునని ఏబీడీ అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్ 2026 సీజన్కు శనివారం తెరలేవనుండగా.. ఆదివారం వాంఖడే వేదికగా కోల్కతాతో జరిగే మ్యాచ్తో ముంబై ఇండియన్స్ తమ క్యాంపైన్ను ప్రారంభించనుంది.