టీమిండియా స్టార్ బ్యాటర్, తెలుగు తేజం తిలక్ వర్మకు గ్రూప్-1 ఉద్యోగం ఇవ్వాలని బీఆర్ఎస్ హుజూరాబాద్ ఎమ్మెల్యే, మాజీ హైదరాబాద్ రంజీ క్రికెటర్ పాడి కౌశిక్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ సిరాజ్కు డీఎస్పీ ఉద్యోగం ఇచ్చినట్లే తిలక్ వర్మకు ఉద్యోగం ఇవ్వాలని అసెంబ్లీలో కోరారు.
తిలక్ వర్మతో పాటు మాజీ బ్యాడ్మింటన్ ప్లేయర్ గుత్త్తా జ్వాల, మాజీ క్రికెటర్ ప్రజ్ఞాన్ ఓజా, అండర్ 19 వరల్డ్ కప్ టీమ్ మెంబర్ ద్రితికి కూడా నగదుసాయం, స్థలం, ఉద్యోగాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 గెలిచిన భారత జట్టులో తిలక్ వర్మ సభ్యుడిగా ఉన్నాడు. 9 మ్యాచ్ల్లో 154.47 స్ట్రైక్రేటుతో 207 పరుగులు చేశాడు. చివర్లో బ్యాటింగ్కు వచ్చి విలువైన పరుగులతో భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఐసీసీ టీ20 ప్రపంచకప్ గెలిచిన తిలక్ వర్మకు సిరాజ్ తరహాలోనే తెలంగాణ ప్రభుత్వం గ్రూప్-1 ఉద్యోగంతో పాటు నివాస స్థలం బహుమతిగా ఇస్తుందని అంతా అనుకున్నారు.

ప్రపంచకప్ విజయం తర్వాత హైదరాబాద్కు ఆలస్యంగా వచ్చిన తిలక్ వర్మ.. నేరుగా సీఎం రేవంత్ రెడ్డిని తన నివాసంలో కలిసారు. ఈ సందర్భంగా తిలక్ వర్మను రేవంత్ రెడ్డి సత్కరించారు. కానీ ఎలాంటి బహుమానం ప్రకటించలేదు. ఈ క్రమంలోనే తిలక్ వర్మకు గ్రూప్-1 ఉద్యోగంతో పాటు నివాస స్థలం, క్యాష్ ప్రైజ్ ఇవ్వాలని పాడి కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణలో ఉన్న మెరికల్లాంటి క్రీడాకారులను ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
రాజకీయాల్లోకి రాక ముందు పాడి కౌశిక్ రెడ్డి హైదరాబాద్ తరఫున రంజీ క్రికెట్ ఆడారు. టీమిండియాకు ఆడే అవకాశాన్ని కూడా అతను తృటిలో కోల్పోయారు. కుడిచేతి వాటం మీడియం పేస్ బౌలర్ అయిన కౌశిక్ రెడ్డి..2004 నుంచి 2008 వరకు హైదరాబాద్ జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. 15 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ల్లో 299 పరుగులు చేసిన కౌశిక్ రెడ్డి 47 వికెట్లు పడగొట్టాడు. ఐదు వికెట్ల ఘనతను రెండు సార్లు అందుకున్నాడు. లిస్ట్-ఏ క్రికెట్లో 12 మ్యాచ్లు ఆడిన కౌశిక్ రెడ్డి 17 వికెట్లు తీసాడు. రంజీ మ్యాచ్లో రోహిత్ శర్మను ఔట్ కూడా చేశాడు.