టీమిండియా స్టార్ ఆల్ రౌండర్, ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా గొప్ప మనసు చాటుకున్నాడు. ముంబైలోని వాంఖడే స్టేడియానికి చెందిన 11 మంది గ్రౌండ్స్మెన్కు తలో రూ.10 లక్షలు అందజేశాడు. ఈ మేరకు వారికి ఈ చెక్కులు అందజేశాడు. తద్వారా కొన్ని నెలల క్రితం గ్రౌండ్స్మెన్కు తాను ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నాడు.
ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీకి ముందు హార్దిక్ పాండ్యా.. వాంఖడే స్టేడియంలో తీవ్రంగా కష్టపడ్డాడు. ఫిట్నెస్ కోసం ఆర్మీ తరహా ట్రైనింగ్ తీసుకున్న హార్దిక్.. బౌలింగ్, బ్యాటింగ్ను మెరుగుపర్చుకునేందుకు నెట్స్లో గంటలకొద్దీ చెమటోడ్చాడు. ఆ సమయంలో అర్ధరాత్రి వరకు మైదానంలోనే గడిపేవాడు. హార్దిక్ ప్రాక్టీస్ కోసం అక్కడి గ్రౌండ్ స్టాఫ్ తమ విధులు ముగిసినా కూడా అదనపు గంటలు వేచి ఉండి అతనికి కావాల్సిన సౌకర్యాలను సమకూర్చేవారు.

నెట్స్ సిద్ధం చేయడం నుంచి పిచ్ పర్యవేక్షణ వరకు సిబ్బంది హార్దిక్ కు ఎంతో సహకరించారు. ఆ సమయంలోనే హార్దిక్ వారందరికీ మంచి గిఫ్ట్ ఇస్తానని చెప్పాడు. ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో టీమిండియా విజేతగా నిలవడంతో పాటు హార్దిక్ పాండ్యా మెరుగైన ప్రదర్శన కనబర్చాడు. దాంతో గురువారం ముంబై ఇండియన్స్ ప్రాక్టీస్ సెషన్ ముగిసిన తర్వాత హార్దిక్ పాండ్యా.. ఆ 11 మంది సిబ్బందిని పిలిచి ఒక్కొక్కరికి పది లక్షల రూపాయల చెక్కును అందజేశాడు. తన ఎదుగుదలలో భాగమైన సిబ్బందిని గుర్తుంచుకుని మరీ వారిని సత్కరించిన హార్దిక్ పాండ్యాపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తుంది.
చెక్కులు అందుకున్న సిబ్బంది హార్దిక్ పాండ్యాతో కలిసి దిగిన ఫోటోలు నెట్టింట వైరల్గా మారాయి. హార్దిక్ పాండ్యాను నెటిజన్లు రియల్ హీరో అని కొనియాడుతున్నారు. మైదానంలో అప్పుడప్పుడు అటిట్యూడ్ చూపించినా.. ఇలాంటి విషయాల్లో హార్దిక్ను మెచ్చుకోవాల్సిందేనని కొందరు కామెంట్ చేస్తున్నారు. ఐపీఎల్ 2026 సీజన్కు శనివారం తెరలేవనుండగా.. వాంఖడే వేదికగా ఆదివారం కోల్కతాతో జరిగే మ్యాచ్తో ముంబై ఇండియన్స్ తమ క్యాంపైన్ను ప్రారంభించనుంది. హార్దిక్ పాండ్యా సారథ్యంలో ఐసీసీ టీ20 ప్రపంచకప్లు గెలిచిన రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ ఆడుతున్నారు.