|
అసలేం జరిగిందంటే..?
గుజరాత్లోని మెహ్సనా జిల్లా మోలిపూర్ గ్రామానికి చెందిన కొందరు యువకులు యూట్యూబ్ వేదికగా ఫేక్ ఐపీఎల్ మ్యాచ్లను ప్రసారం చేశారు. చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ జెర్సీలను తోట పనిచేసే కూలీలకు వేయించి మ్యాచ్లు నిర్వహించారు. అంతటితో ఆగకుండా ప్రముఖ క్రికెట్ కామెంటేటర్ హర్షా భోగ్లే వాయిస్ని మిమిక్రీ చేస్తూ.. నిజమైన ఐపీఎల్ మ్యాచ్లను చూస్తున్న అనుభూతిని కలిగించారు. ఒక్కో మ్యాచ్లో ప్లేయర్లుగా నటించేందుకు కూలీ పని చేసేవాళ్లకు రోజుకు రూ.400 ఇచ్చి తీసుకొచ్చారు.
అనుమానం రాకుండా..
అలాగే అంపైర్లు కూడా ఫేక్ వాకీ టాకీల్లో మాట్లాడుతున్నట్టు నటించేవాళ్లు. యూట్యూబ్లో 5HB కెమెరాలను వాడి మ్యాచ్లను ప్రత్యక్ష ప్రసారం చేసారు. బెట్టింగ్ చేసేందుకు వీలుగా టెలిగ్రామ్ లింకులను పెట్టేవాళ్లు. ప్రతీ ప్లేయర్కు ఏం చేయాలో, ఎలా చేయాలో సూచనలు వెళ్లేవి. ఓ రకంగా పక్కా ప్లాన్తో ఎంతో పకడ్భందీగా మూడు వారాల పాటు ఈ ఫేక్ ఐపీఎల్ మ్యాచులను నిర్వహించారు. ఇందుకోసం 21 మంది తోట పని చేసే కూలీలను, అదే గ్రామానికి చెందిన కొందరు నిరుద్యోగ యువకుల సేవలను వాడుకున్నారు.
|
భారీ మొత్తంలో మోసపోవడంతో..
స్టేడియంలో వేల మంది మ్యాచుల చూస్తున్నట్టుగా గ్రాఫిక్స్, సౌండ్స్ యాడ్ చేసారు. ఈ మ్యాచ్లను చూసి నిజమైన ఐపీఎల్ మ్యాచ్లని నమ్మిన రష్యా జనాలు, టెలిగ్రామ్ ద్వారా బెట్టింగ్ వేసారు. ప్లానింగ్ ప్రకారం జరుగుతున్న ఈ మ్యాచ్లతో రష్యాకు చెందిన టివర్, వొరోనెజ్, మాస్కో నగరాలకు చెందిన చాలా మంది లక్షల్లో డబ్బులు పొగొట్టుకున్నారు. దాంతో వారు అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక సైబర్ క్రైమ్ పోలీసుల ద్వారా సమాచారం తెలుసుకున్న మెహ్సానా పోలీసులు ఈ హవాలా చానెల్ నడిపిస్తున్న నలుగురిని అరెస్ట్ చేయగలిగారు.
ఆనంద్ మహేంద్రా ఫిదా..
ఈ మొత్తం తతంగాన్ని నడిపించిన ఛీప్ ఆర్గనైజన్ షోయబ్ దేవ్డా, రష్యలో ఫేమస్ పబ్లకు వెళుతూ అక్కడివారికి ఈ ఐపీఎల్ గురించి, దానిపై బెట్టింగ్ పెడితే వచ్చే రిటర్న్స్ గురించి ప్రచారం చేసేవాడు. ఆసక్తి ఉన్నవారిని కనిపెట్టి, వారితో బెట్టింగ్ వేయించేవాడు. ఇలా మొదటి ఇన్స్టాల్మెంట్గా రష్యన్ బెట్టింగ్ రాయుళ్లు ఒక్కొక్కరి నుంచి రూ.3 లక్షలు వసూలు చేశారు. మహేంద్ర సంస్థల అధినేత ఆనంద్ మహేంద్ర కూడా ఈ భారీ మోసానికి ఫిదా అయ్యాడు.'ఇది నమ్మశక్యం కాకుండా ఉంది. దీన్ని వాళ్లు 'మెటావర్స్ ఐపీఎల్' అని పిలిచి ఉంటే, బిలియన్ డాలర్లు సంపాదించేవాళ్లు.'అంటూ కామెంట్ చేశాడు. తన వాయిస్ని ఇమిటేట్ చేశారని తెలిసిన క్రికెట్ కామెంటేటర్ హర్షా భోగ్లే, 'నవ్వకుండా ఉండలేకపోతున్నా... వాళ్ల కామెంటరీ తప్పకుండా ఓ సారి వినాలి.'అని ట్వీట్ చేశాడు.