హైదరాబాద్: ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్లోని అన్ని ఫార్మాట్లకు గౌతమ్ గంభీర్ రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఢిల్లీ జట్టు తరఫున రంజీ ట్రోఫీలో చివరి మ్యాచ్లో సెంచరీ బాదిన గంభీర్ క్రికెట్లో అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే.
టెస్టు క్రికెట్లో గంభీర్ సత్తాకు పరీక్షగా నిలిచింది ఆ ఇన్నింగ్సే!
తన క్రికెట్ కెరీర్ ముగిసిన తర్వాత గంభీర్ యువ క్రికెటర్లకు బాసటగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. ఈ మేరకు ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్యూలో గంభీర్ మాట్లాడుతూ భావి తరం క్రికెటర్లు, క్రికెట్కి సంబంధించి కోచింగ్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు పేర్కొన్నాడు.
''నాకు క్రికెట్ ఆడటం తప్ప మరే పని రాదని నేను అనుకుంటున్నా. ఈ కోచింగ్ని కూడా నేను అంతే శ్రద్ధతో చేస్తాను. యువ క్రికెటర్లకు సహాయం చేసేందుకు నేను సిద్ధంగా ఉన్నా. దీనికి డీడీసీఏ నుంచి కూడా సహకారం అందుతుందని భావిస్తున్నా'' అని గంభీర్ అన్నాడు.
37 ఏళ్ల గౌతమ్ గంభీర్ భారత్ తరపున 58 టెస్ట్లు, 147 వన్డేలు, 37 టీ20లకు ప్రాతినిథ్యం వహించాడు. 2016లో ఇంగ్లాండ్తో చివరి టెస్టు ఆడిన గౌతం గంభీర్.. చివరి వన్డేను కూడా 2013లో ఇంగ్లాండ్తోనే ఆడటం విశేషం. గంభీర్ తన చివరి టీ20ని 2012లో పాకిస్థాన్పై ఆడాడు.
భారత్ సాధించి రెండు వరల్డ్ కప్ల్లోనూ సభ్యుడిగా ఉన్నాడు. ముంబైలోని వాంఖడె స్టేడియంలో జరిగిన 2011 వరల్డ్కప్ ఫైనల్లో 97 పరుగులతో భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇక, 2007 టీ20 వరల్డ్కప్ నెగ్గిన జట్టులో కూడా సభ్యుడిగా ఉన్నాడు.
దీంతో పాటు కెప్టెన్గా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) కోల్కతా నైట్రైడర్స్ జట్టును రెండుసార్లు విజేతగా నిలపడంలో గంభీర్ది కీలకపాత్ర. 2009లో భారత్ టెస్టుల్లో తొలిసారి నంబర్వన్గా నిలిచినప్పుడు, 2008లో ఆస్ట్రేలియా గడ్డపై చిరస్మరణీయ సీబీ వన్డే సిరీస్ గెలిచినప్పుడు గంభీర్ జట్టులో సభ్యుడుగా ఉన్నాడు.