ప్రశాంతంగా ఉన్నా:
ఐపీఎల్ 2021 సీజన్ వాయిదా పడడంతో.. టోర్నీలో పాల్గొన్న విదేశీ ఆటగాళ్లందరూ స్వస్థలాలకు చేరుకుంటున్నారు. ఆసీస్ ఆటగాళ్లు మినహా మిగతావారందరు ఇప్పటికే ఇళ్లకు చేరుకున్నారు. పది మంది దక్షిణాఫ్రికా క్రికెటర్లతో కలిసి స్వదేశానికి చేరుకున్న క్రిస్ మోరిస్.. ప్రస్తుతం అక్కడి ప్రభుత్వ షరతుల మేరకు పది రోజులు క్వారంటైన్లో గడుపుతున్నాడు. ఈ సందర్భంగా మోరిస్ ఐపీఎల్ వాయిదాపై స్పందించాడు. 'ప్రస్తుతం చాలా ప్రశాంతంగా ఉన్నాను. బబుల్ లోపల ఆటగాళ్లు కరోనా బారిన పడుతున్నారని తెలియగానే అందరిలోనూ ప్రశ్నలు మొదలయ్యాయి. మాలో అలారం మోతలు మోగడం ఆరంభమైంది' అని అన్నాడు.
అప్పుడే అర్థమైంది
'సోమవారం నాటి కోల్కతా-బెంగళూరు మ్యాచ్ వాయిదా పడగానే ఐపీఎల్ టోర్నీ ఒత్తిడిలో పడబోతోందని అర్థమైంది. నేను బస చేసిన హోటల్లో మా జట్టు డాక్టర్తో మాట్లాడుతూ వెళ్తుంటే.. మా కోచ్ కుమార సంగక్కర ఎదురుపడి.. తన గొంతు దగ్గర అడ్డంగా చేయి పెట్టి సంజ్ఞ చేశాడు. ఐపీఎల్ టోర్నీ కథ ముగిసిందని అప్పుడే అర్థమైంది. వెంటనే అందరిలోనూ ఆందోళన మొదలైంది. ఇంగ్లండ్ ఆటగాళ్లు అయితే చాలా భయపడ్డారు. ఎందుకంటే.. వారి దేశానికి వెళ్లగానే హోటళ్లలో ఐసొలేట్ కావాలి. కానీ అక్కడ గదులు అందుబాటులో లేవు' అని దక్షిణాఫ్రికా ఆల్రౌండర్ క్రిస్ మోరిస్ తెలిపాడు.
IPL 2021: కరోనా నెగెటివ్ వచ్చినా.. క్వారంటైన్లోనే చెన్నై కోచ్!!
బాధ పడుతుంటే అతణ్ని ఓదార్చాను
'మా రాజస్థాన్ జట్టు నుంచి ముందే స్వదేశానికి వెళ్లిపోయిన ఆండ్రు టై స్థానంలో ఎంపికైన మా దేశ కుర్రాడు జెరాల్డ్ కొయెట్జె పాపం అప్పుడే ఇండియాకు చేరుకుని మాతో కలిశాడు. ఐపీఎల్ ఆడుదామని ఎన్నో కలలు కన్నాడు. ఐపీఎల్ వాయిదా పడిన విషయం తెలిసి నిరాశకు గురయ్యాడు. జెరాల్డ్ చాలా బాధ పడుతుంటే అతణ్ని ఓదార్చాను' అని క్రిస్ మోరిస్ పేర్కొన్నాడు. గత ఏడాది వరకు బెంగళూరుకు ఆడిన మోరిస్ను.. రాజస్థాన్ ఈ ఏడాది వేలంలో కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఐపీఎల్ చరిత్రలోనే రికార్డు స్థాయిలో రూ.16.25 కోట్లకు రాజస్థాన్ అతడిని సొంతం చేసుకుంది. ఈ సీజన్లో తడబడ్డ రాయల్స్కు క్రిస్ మోరిస్ రెండు మ్యాచ్ల్లో ఒంటి చేత్తో విజయాలందించాడు.