
చెన్నై: కరోనా వైరస్ బారినపడిన చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) బ్యాటింగ్ కోచ్, ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు మైకేల్ హస్సీ కోలుకుంటున్నాడు. తాజాగా నిర్వహించిన కరోనా పరీక్షల్లో అతనికి నెగెటివ్గా తేలిందని ఫ్రాంఛైజీ సీఈవో కాశీ విశ్వనాథన్ ఓ ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం చెన్నైలోని ఓ హోటల్లోనే హస్సీ క్వారంటైన్లో ఉన్నాడు. మరోసారి నిర్వహించిన పరీక్షలో నెగెటివ్ వస్తే.. హస్సీ మాల్దీవుల్లో ఉన్న ఆస్ట్రేలియా బృందంతో చేరనున్నాడని ఆస్ట్రేలియా మీడియా పేర్కొంది. ఐపీఎల్ 2021లో పాల్గొన్న ఆసీస్ ఆటగాళ్లు ఇప్పటికే మాల్దీవులకు చేరుకొని క్వారంటైన్లో ఉన్నారు.
చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంఛైజీలో మైకేల్ హస్సీతో పాటు బౌలింగ్ కోచ్ లక్ష్మీపతి బాలాజీకి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. రెండు రోజుల క్రితం చెన్నై టీమ్ ఢిల్లీలో ఉంది. ఆటగాళ్లు అందరూ ఇళ్లకు వెళ్లిపోవడంతో.. కరోనా బారిన పడిన బాలాజీ, హస్సీని ఎయిర్ అంబులెన్స్లో ఆ జట్టు యాజమాన్యం చెన్నైకి తరలించింది. అక్కడ ఇద్దరిని ఐసోలేషన్లో ఉంచి మెరుగైన చికిత్స అందించారు. దీంతో ఇద్దరూ త్వరగానే కోలుకున్నారు. మొదటిసారి పరీక్షల్లో హస్సీకి నెగెటివ్గా తేలింది. బాలాజీ కూడా పూర్తి ఆరోగ్యంగా ఉన్నాడని సమాచారం.
పలు జట్లలో కరోనా కేసులు నమోదవడంతో బీసీసీఐ ఐపీఎల్ 2021ని మంగళవారం వాయిదా వేసింది. అన్ని జట్ల క్రికెటర్లు, సారథులు అందుబాటులో ఉన్న వసతులతో ఇంటికి వెళ్లేందుకు ప్రయత్నించారు. కానీ చెన్నై కెప్టెన్ ఎంఎస్ ధోనీ మాత్రం బాధ్యతాయుతంగా ఆఖరి వరకూ హోటల్లో ఉండి సహచరుల ప్రయాణ ఏర్పాట్లని పర్యవేక్షించాడు. మొదటగా టీమ్లోని విదేశీ క్రికెటర్ల ప్రయాణానికి ప్రాధాన్యమిచ్చిన మహీ.. ఆ తర్వాత భారత క్రికెటర్ల ప్రయాణ ఏర్పాట్లని సమీక్షించాడట. ఈ క్రమంలో చెన్నై టీమ్ బస చేసిన హోటల్ నుంచి చివరిగా వెళ్లింది ధోనీనే.
చెన్నై గతేడాది ఐపీఎల్ సీజన్ను మరిపిస్తూ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. ఎప్పటిలానే ఐపీఎల్ 2021లో సీఎస్కే అద్భుతంగా రాణించింది. లీగ్ నిలిచిపోయిన సమయానికి ఆడిన 7 మ్యాచుల్లో ఐదు విజయాలు అందుకుని పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. ఓపెనర్ ఫాఫ్ డుప్లెసిస్, మిస్టర్ ఐపీఎల్ సురేష్ రైనా, సర్ రవీంద్ర జడేజా, ఆల్రౌండర్ సామ్ కరన్, స్వింగ్ మాస్టర్ దీపక్ చహర్ చెన్నై విజయాల్లో కీలక పాత్ర పోషించారు.