
హైదరాబాద్: టెస్టు సిరిస్ అనంతరం శ్రీలంకతో జరిగే పరిమిత ఓవర్ల సిరిస్కు టీమిండియా వెటరన్ క్రికెటర్ యువరాజ్ని ఎంపిక చేయకపోవడానికి కారణాన్ని చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ వెల్లడించారు. శ్రీలంకతో టీ20, దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ల కోసం బీసీసీఐ సోమవారం జట్లను ప్రకటించిన సంగతి తెలిసిందే.
సోమవారం జట్లను ప్రకటించడానికి ముందే యువరాజ్ సింగ్ యో-యో టెస్టులో పాసయ్యాడు. దీంతో తిరిగి జట్టులో యువరాజ్ చోటు దక్కించుకుంటాడని అభిమానులు అనుకున్నారు. అయితే సెలక్టర్లు మాత్రం యువరాజ్కు మొండిచేయి చూపించారు. దీంతో అభిమానులు నిరుత్సాహానికి గురయ్యారు.
ఇప్పటివరకు యో-యో టెస్టులో యువీ పాసవ్వలేదని అందుకే యువీని జట్టులోకి తీసుకోలేదని సెలక్టర్లు చెబుతూ వచ్చారు. ఇప్పుడు యో-యో టెస్టులో పాస్ అయినా... అతడిని ఎందుకు ఎంపిక చేయలేదని సోషల్ మీడియాలో నెజిటన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో దీనిపై బీసీసీఐ చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ స్పందించాడు. 'ఇటీవల కాలంలో యువీ ఫిట్నెస్ సమస్యలతో బాధపడుతున్నాడు. యో-యో టెస్టు పాసైన అనంతరం అతడు ఎలాంటి క్రికెట్ ఆడలేదు. ఏదైనా టోర్నీలో ఆడి ఉంటే ఎలా ఆడుతున్నాడన్న దానిపై ఓ అంచనాకి వచ్చేవాళ్లం. కానీ అతడు ఎలాంటి టోర్నీ ఆడలేదు. అందుకే ఎంపిక చేయలేదు' అని అన్నాడు.
ఇదిలా ఉంటే సోమవారం యునిసెఫ్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో యువరాజ్ మాట్లాడాడు. గత కొంతకాలంగా ఫిట్నెస్ పరీక్షల్లో విఫలమవుతున్నానని, కానీ తాజాగా నిర్వహించిన ఫిట్నెస్ పరీక్షలో పాస్ అయ్యానని 36 ఏళ్ల యువరాజ్ సింగ్ తెలిపాడు. ప్రస్తుతం 2019 ప్రపంచకప్ కోసం తాను సిద్ధంగా ఉన్నట్లు యువీ తెలిపాడు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.