తేలేది మే7న: ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ ఆడుతుందా?
హైదరాబాద్: ఈ ఏడాది జూన్లో ఇంగ్లాండ్లో జరిగే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ పాల్గొంటుందా? లేదా అనే విషయం మే 7వ తేదీన తేలనుంది. ఈ మేరకు బీసీసీఐ బోర్డు కొత్త పరిపాలక కమిటీ (సీఓఏ) చీఫ్ వినోద్ రాయ్ స్పష్టం చేశారు. ఆదాయ పంపిణీ విధానంలో బీసీసీఐకి వ్యతిరేకంగా నిర్ణయం వెలువడిన నేపథ్యంలో ప్రత్యేక సర్వసభ్య సమావేశం (ఎస్జీఎం)ను ఏర్పాటు చేయాలని బీసీసీఐ నిర్ణయించింది.
మే 7న జరిగే బీసీసీఐ ప్రత్యేక సర్వసభ్య సమావేశం (ఎస్జీఎమ్)లో చర్చించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకోనుంది. మే 7వ తేదీన ఢిల్లీ వేదికగా ఎస్జీఎం జరగనుందని బీసీసీఐ తాత్కాలిక అధ్యక్షుడు సీకే ఖన్నా శుక్రవారమిక్కడ తెలిపాడు. ఐసీసీలో బిగ్ 3 ఫార్ములాకు చుక్కెదురవడంతో ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి తప్పుకుంటారా? అన్న ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు.
'దాన్ని ఇప్పుడే ఎలా చెప్పగలను. అన్ని అవకాశాలను పరిశీలిస్తున్నాం. ఎస్జీఎంలో బోర్డు ఉన్నతాధికారులంతా కలిసి దీనిపై చర్చించాకే నిర్ణయం తీసుకుంటారు. అంతే తప్ప అదేదీ జరగకముందే ముందస్తుగా చెప్పడం వీలు కాదు' అని ఆయన అన్నారు. ఐసీసీ ఆదాయ పంపిణీలో బీసీసీఐకి వ్యతిరేకంగా నిర్ణయం వెలువడటంతో ఛాంపియన్స్ ట్రోఫీని భారత జట్టు బహిష్కరించనుందని వార్తలు వచ్చాయి.

ఛాంపియన్స్ టోర్నీకి దూరమైతే
అయితే దీనివల్ల బీసీసీఐకి నష్టం జరిగిన మాట వాస్తవమేగా ఛాంపియన్స్ టోర్నీకి దూరమైతే ప్రపంచ క్రికెట్లో భారత్ ఒంటరయ్యే ప్రమాదముందని సీనియర్లు హెచ్చరిస్తున్నారు. మరోవైపు ఛాంపియన్స్ ట్రోఫీ కోసం టీమిండియాను ప్రకటించే తుదిగడువు (ఏప్రిల్ 25) ముగిసినప్పటికీ బీసీసీఐ మాత్రం ఇప్పటివరకు జట్టును ఎంపిక చేయలేదు.

390 మిలియన్ డాలర్లు ఇస్తామని ముందుకొచ్చిన ఐసీసీ
ఇక కొత్త ఫార్ములా ప్రకారం 293 మిలియన్ డాలర్లతోపాటు అదనంగా మరో 100 మిలియన్ డాలర్లు ఇచ్చేందుకు ఐసీసీ ముందుకొచ్చింది. వర్కింగ్ గ్రూప్ కూడా ఓటింగ్కు ముందు బీసీసీఐ ప్రతినిధి అమితాబ్ చౌదరితో సమావేశమై మొత్తం 390 మిలియన్ డాలర్లు ఇస్తామని అధికారికంగా ప్రతిపాదించింది.

450 మిలియన్ డాలర్లు ఇవ్వాలని కోరిన బీసీసీఐ
అయితే ఐసీసీ పరిపాలనలో ఎలాంటి మార్పులు చేయకుండా 450 మిలియన్ డాలర్లు ఇవ్వాలని బీసీసీఐ కోరుతోంది. ఒకవేళ 450 మిలియన్ డాలర్లు ఇచ్చేందుకు ఒప్పుకుంటే మా బోర్డును ఒప్పిస్తామని అమితాబ్ చౌదురి అంతర్జాతీయ కౌన్సిల్కు చెప్పారు. కానీ మనోహర్ దీనికి ఒప్పుకునే స్థితిలో లేడని ఐసీసీ వర్గాలు పేర్కొన్నాయి.

మిగతా దేశాలతో పోలిస్తే భారత్కే ఎక్కువ
కొత్త ఆదాయ పంపిణీ పద్ధతితో బీసీసీఐ ఆదాయానికి భారీగా కోత పడినా.. మిగతా దేశాలతో పోలిస్తే ఇప్పటికీ భారత్కే ఎక్కువ వాటా అందనుంది. బిగ్-3 ఫార్ములా ప్రకారం ఎనిమిదేండ్ల కాలానికి బీసీసీఐకి 570 మిలియన్ డాలర్లు వచ్చేవి. కానీ కొత్త విధానం ప్రకారం ఇప్పుడు 293 మిలియన్ డాలర్లు ఆదాయం మాత్రమే వస్తున్నా.. మిగతా దేశాల కంటే ఇది చాలా ఎక్కువ.

ఏడు సభ్య దేశాలకు ఒక్కొక్కరికి 132 మిలియన్ డాలర్లు
ఇంగ్లండ్కు 143 మిలియన్ డాలర్లు, జింబాబ్వేకు 94 మిలియన్ డాలర్లు, మిగతా ఏడు సభ్య దేశాలకు ఒక్కొక్కరికి 132 మిలియన్ డాలర్ల చొప్పున ఆదాయం సమకూరనుంది. జింబాబ్వేకు అత్యల్పంగా 94 మిలియన్ డాలర్లు దక్కనుండగా.. మిగతా బోర్డులకు 132 మిలియన్ డాలర్ల చొప్పున లభించనున్నాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications