దుబాయ్ : కరోనా నేపథ్యంలో ఎన్నో ఆటంకాలను అధిగమిస్తూ ప్రారంభమైన ఐపీఎల్ 2020 సీజన్ రెండు నెలలపాటు అభిమానులను అలరించింది. ఢిల్లీ క్యాపిటల్స్తో మంగళవారం జరిగిన ఫైనల్ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ ఐదు వికెట్లతో గెలుపొంది టైటిల్ను సొంతం చేసుకుంది.
ఈ టోర్నీ మెత్తంలో క్రిస్గేల్ రాక తనను ఎంతగానో ఆకట్టుకుందని, ఈ సీజన్లో తన ఫెవరెట్ మూమెంట్ కూడా ఇదేనని వెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్ బ్రియన్ లారా అన్నాడు. స్టార్ స్పోర్ట్స్తో మాట్లాడుతూ.. 'యూనివర్స్ బాస్ రీ ఎంట్రీ నా ఫేవరెట్ మూమెంట్. ఫస్టాఫ్ మ్యాచ్లు ఆడకపోవడంతో అతని ఎంట్రీ కోసం చాలా మంది ప్రేక్షకులు ఎదురు చూశారు. అతను బరిలోకి దిగాక కింగ్స్ ఎలెవన్ పంజాబ్ అద్భుత విజయాలందుకుంది. దాదాపు ప్లే ఆఫ్స్ బెర్త్ దక్కించుకునేలా కనిపించింది. ఇలా గేల్ తన ఆటతో జట్టు రాతను మార్చడం నన్ను విపరీతంగా ఆకట్టుకుంది'అని లారా చెప్పుకొచ్చాడు.
ఇక అస్వస్థత కారణంగా గేల్ సీజనులో తొలిఅర్ధభాగం మ్యాచులకు దూరంగా ఉన్నాడు. ఈ క్రమంలో పంజాబ్ జట్టు ఏడు మ్యాచులాడి ఒకదాంట్లోనే విజయం సాధించింది. ఆ తర్వాత గేల్ జట్టులోకి రావడంతో పంజాబ్ జట్టు వరుస విజయాలను అందుకొని ఫ్లేఆఫ్ రేసులో నిలిచింది. ఈ సీజనులో ఏడు మ్యాచులాడిన గేల్ మూడు అర్ధశతకాలతో 288 పరుగులు చేశాడు. రాజస్థాన్తో జరిగిన మ్యాచులో 99 పరుగుల వద్ద ఔట్ అయి సెంచరీ అందుకోలేకపోయాడు.
వేలంలో రూ. 2 కోట్ల కనీస ధరతో ఉన్న గేల్ను తీసుకునేందుకు ఏ ఫ్రాంచైజీ ఆసక్తికనబర్చలేదు. రెండు రౌండ్ల తర్వాత కూడా అతను అమ్ముడు పోని ఆటగాళ్ల జాబితాలో నిలిచాడు. కానీ చివరకు కనీస ధరకు గేల్ను పంజాబ్ తీసుకుంది. గత రెండు సీజన్లలో 350, 400 పరుగులతో జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు.
IPL 2020: డివిలియర్స్ ఆ జట్టును వదిలేయ్.. ముంబైలోకి వచ్చేయ్!