మైకు ముందు హీరోలు.. మైదానంలో జీరోలు..
'కోహ్లీతో బాబర్ను పోల్చడం జనాలు మానుకోవాలి. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి వాళ్లు చాలా పెద్ద ఆటగాళ్లు. పాక్ జట్టులో ఒక్కరంటే ఒక్కరిని కూడా వాళ్లతో పోల్చలేం. పాక్ ఆటగాళ్లను మైక్ ముందు మాట్లాడమంటే హీరోల్లా డైలాగులు వేస్తారు. కానీ మైదానంలో ఫలితాలు చూపించమంటే కళ్లు తేలేస్తారు. వాళ్లు పక్కా జీరోలు' అని దానిష్ కనేరియా ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇంగ్లండ్తో జరుగుతున్న టెస్టు సిరీస్లో పాకిస్తాన్ పేలవమైన ప్రదర్శన చేసింది. వరుసగా మూడు టెస్టుల్లోనూ ఓడి సిరీస్ వైట్ వాష్కు గురైంది. ఈ క్రమంలోనే కనేరియా తన యూట్యూబ్ ఛానెల్లో సంచలన వ్యాఖ్యలు చేశాడు.
కెప్టెన్గా పనికిరాని బాబర్..
ప్రస్తుత పాకిస్తాన్ సారధి బాబర్ ఆజమ్ను టార్గెట్ చేసిన కనేరియా కీలక వ్యాఖ్యలు చేశాడు. అతను అసలు జట్టుకు నాయకత్వం వహించడానికి పనికిరాడన్నాడు. 'ఒక కెప్టెన్గా బాబర్ పెద్ద జీరో. జట్టుకు నాయకత్వం వహించడానికి అతను పనికిరాడు. ఆ అర్హతే తనకు లేదు. ముఖ్యంగా టెస్టు క్రికెట్లో అతను కెప్టెన్గా అస్సలు పనికిరాడు. బెన్స్టోక్స్, బ్రెండన్ మెకల్లమ్ వంటి వాళ్లను చూసి కెప్టెన్సీ నేర్చుకునే అవకాశం ఉన్నా ఉపయోగించుకోలేదు. అంతెందుకు ఈగో పక్కన పెడితే టెస్టు సిరీస్కు ఎంపికైన సర్ఫరాజ్ అహ్మద్ కూడా ఉన్నాడు. అతన్నయినా కెప్టెన్సీ ఎలా చేయాలో అడిగి తెలుసుకోవచ్చు కదా' అని కనేరియా మండిపడ్డాడు.
మూడో టెస్టులోనూ ఓటమే..
పాక్ పర్యటనకు వచ్చిన ఇంగ్లండ్ తొలి రెండు టెస్టుల్లో అద్భుతంగా రాణించి విజయం సాధించింది. దీంతో మూడో టెస్టులో అయినా నెగ్గి పరువు నిలుపుకోవాలని బాబర్ టీం భావించింది. కానీ అది కూడా ఆ జట్టుకు సాధ్యం కాలేదు. తొలి ఇన్నింగ్సులో పాకిస్తాన్ 304 పరుగులకు ఆలౌట్ కాగా.. ఇంగ్లండ్ జట్టు 354 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్లో 216 పరుగులకు పాకిస్తాన్ చాపచుట్టేసింది. దీంతో ఇంగ్లండ్ ముందు 167 పరుగుల టార్గెట్ నిలిచింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి 115/2తో ఉన్న ఇంగ్లండ్.. నాలుగో రోజు ఆట మొదలైన కాసేపటికే వికెట్లేమీ కోల్పోకుండా ఈ లక్ష్యాన్ని ఛేదించింది. అంతకుముందు ఆస్ట్రేలియాతో స్వదేశంలో జరిగిన టెస్టు సిరీస్లో కూడా పాక్ ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఉపఖండంలో పిచ్లు అలవాటు లేని రెండు జట్ల చేతుల్లో టెస్టు సిరీస్లో ఓడిపోవడంతో బాబర్ కెప్టెన్సీపై కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.