న్యూఢిల్లీ: భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ, సెక్రటరీ జైషాకు భారీ ఊరట లభించింది. బీసీసీఐ రాజ్యాంగంలోనే ప్రతిపాదిత మార్పులకు దేశ అత్యున్నత న్యాయస్థానం బుధవారం ఆమోదం తెలిపింది. దాంతో అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, సెక్రటరీ జైషా మరో మూడేళ్లు తమ పదవుల్లో కొనసాగేందుకు మార్గం సుగుమమైంది. బీసీసీఐ ఆఫిస్ బేరర్లకు సంబంధించిన కూలింగ్ పీరియడ్ రూల్ తొలగించేందుకు సుప్రీం అంగీకరించింది.
స్టేట్ అసోసియేషన్లో 6 ఏళ్లు.. బీసీసీఐలో మరో 6 ఏళ్లతో సహా ఆఫీస్ బేరర్లు 12 ఏళ్ల పాటు నిరంతర పదవీకాలం కలిగి ఉండవచ్చని ఉత్తర్వులు జారీ చేసింది. కూలింగ్ పీరియడ్ రూల్తో పాటు 70 ఏళ్ల వయో పరిమితిని కూడా తొలగించేలా రాజ్యంగ సవరణ చేసేందుకు అనుమతించాలని బోర్డు దాఖలు చేసిన పిటిన్ను జస్టిస్ చంద్ర చూడ్, జస్టిస్ హిమ కోహ్లీతో కూడిన ధర్మాసనం విచారించింది. ఈ ప్రతిపాదన ఆమోదయోగ్యమైందని పేర్కొన్న ధర్మాసనం.. రాజ్యం సవరణకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. బీసీసీఐ తరఫున మాజీ కేంద్ర మంత్రి, సీనియర్ న్యాయవాది కపిల్ సిబాల్ వాదనలు వినిపించారు.
బీసీసీఐ రాజ్యాంగం ప్రకారం ఏ ఆఫీస్ బేరరైనా రెండు వరుస పర్యాయాల తర్వాత తప్పనిసరి విరామం (కూలింగ్ ఆఫ్ పీరియడ్) తీసుకోవాలి. రాష్ట్ర సంఘంలోనైనా, బీసీసీఐలోనైనా లేదా రెండింటిలో కలిపైనా వరుసగా రెండు దఫాలు (మూడేళ్ల చొప్పున) పదవుల్లో ఉన్న వాళ్లు.. అదే క్రమంలో మూడో పర్యాయం పదవుల్లో ఉండడానికి వీళ్లేదు. మూడేళ్లు విరామం తీసుకుని మళ్లీ పోటీ చేయొచ్చు.
రాష్ట్రంలో ఒక పర్యాయం, ఆ వెంటనే బీసీసీఐలో ఓ పర్యాయం ఆఫీస్ బేరర్గా ఉంటే వరుసగా రెండు పర్యాయాలు పదవిలో ఉన్నట్లే లెక్క. ఇలా రెండింటిని కలపకూడదని, తప్పనిసరి విరామాన్ని ఎత్తేయాలని బోర్డు సుప్రీంని కోరింది. ఈ నిబంధనలు అమలు చేస్తే అధ్యక్షుడు గంగూలీ, కార్యదర్శి జై షా పదవుల్లో కొనసాగలేరు. అయితే సుప్రీం బీసీసీఐ రాజ్యంగ సవరణకు అనుమతించడంతో వారి పదవులకు డోకాలేకుండా పోయింది.