బౌండరీలు ఇవ్వడం రవిశాస్త్రికి నచ్చదు
రవిచంద్రన్ అశ్విన్ యూట్యూబ్ ఛానెల్లో భరత్ అరుణ్ మాట్లాడుతూ... 'రవిశాస్త్రి డ్రెస్సింగ్ రూమ్ నుంచే మ్యాచ్ను పర్యవేక్షిస్తారు. అయితే టీమిండియా ఏ బౌలరైనా బౌండరీ ఇచ్చాడంటే ఆయనకి ఏమాత్రం నచ్చదు. పరుగులు ఇవ్వకపోవడమే శాస్త్రికి కావాల్సింది. భారత్ బౌలింగ్ చేస్తుంటే వికెట్లు తీయాలి. ఒకవేళ ప్రత్యర్థులు బౌలింగ్ చేస్తుంటే మనవాళ్లు పరుగులు చేయాలి. మన బౌలర్లు ఎవరైనా రెండు బౌండరీలు ఇచ్చారంటే.. ఇక అంతే సంగతి. నా మీద అరుపులు, మెరుపులు మొదలవుతాయి' అని అన్నారు.
రహానే ప్రశాంతంగా ఉంటాడు
కెప్టెన్ విరాట్ కోహ్లీకి, తాత్కాలిక కెప్టెన్ అజింక్య రహానేకు మధ్య చాలా వ్యత్యాసం ఉందని బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ పేర్కొన్నారు. ఏ బౌలరైనా సరిగా బంతులేయకపోతే జింక్స్ ఏమీ అనడనే ధీమా ఉంటుందని చెప్పారు. కెప్టెన్సీ పరంగా రహానే ప్రశాంతంగా ఉంటూనే బౌలర్లకు వెన్నుదన్నుగా నిలుస్తాడని చెప్పారు. అదే కోహ్లీ ఆగ్రహం వ్యక్తం చేస్తాడని ఆయన పేర్కొన్నారు. రవిశాస్త్రి మాదిరిగానే మన బౌలర్లు ఎక్కువ పరుగులు ఇవ్వదని కోహ్లీ అనుకుంటాడని అరుణ్ చెప్పుకొచ్చారు. అడిలైడ్లో ఘోర ఓటమి తర్వాత విరాట్ స్వదేశానికి తిరిగిరాగా.. రహానే యువకులతో కలిసి చారిత్రక విజయం సాధించాడు.
సిరాజ్తో అప్పుడే పరిచయం
పేసర్ మహ్మద్ సిరాజ్కు తనతో చీవాట్లు పెట్టించుకోవాలంటే ఇష్టమని బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ అన్నారు. సిరాజ్ టీమిండియాకు ఎంపికవ్వకముందే తనతో పరిచయం ఉందని, హైదరాబాద్ జట్టుకు తాను బౌలింగ్ కోచ్గా ఉన్నప్పటి నుంచే తమ ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఏర్పడిందని భరత్ పేర్కొన్నారు. సిరాజ్ ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్లో అద్భుత ప్రదర్శన చేసిన సంగతి తెలిసిందే. గబ్బా టెస్టులో 5 వికెట్లతో చెలరేగి జట్టు విజయంలో తనవంతు పాత్ర పోషించాడు. గాయాలతో సీనియర్లు జట్టుకు దూరమయినా.. ఆ వెలితి కనబడనీయలేదు.
ఇంగ్లాండ్ సిరీస్ గెలుస్తాం
ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ గెలవడం సంతోషంగా ఉందని, ఇక ఇంగ్లాండ్ సిరీస్పై దృష్టి పెడతామని భరత్ అరుణ్ చెప్పారు. విరాట్ కోహ్లీ జట్టుతో కలవడం మరింత ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుందన్నారు. ఆటగాళ్లు అందరూ మంచి ఫామ్లో ఉన్నారని, ఇంగ్లాండ్ సిరీస్ గెలుస్తామనే ధీమా ఉందని అరుణ్ అన్నారు. ఫిబ్రవరి 5 నుంచి భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య నాలుగు టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది. ఇప్పటికే ఇరు జట్ల ఆటగాళ్లు చెన్నై చేరుకోని క్వారంటైన్లో ఉన్నారు.