హైదరాబాద్: టీమిండియాలో చోటు కోసం అందరూ తహతహలాడుతుంటారు. ఒకసారి స్థానం కోల్పోతే తిరిగి పొందేవరకూ శాయశక్తులా కష్టపడతారు. ఇదే ధోరణిలో తన భావాన్ని వ్యక్తం చేస్తున్నాడు రహానె. ఎల్లప్పుడూ ఆశాభావంతో ఉంటానని భారత క్రికెటర్ అజింక్య రహానె అన్నాడు. భారత వన్డే జట్టులో చోటు కోల్పోవడం సహా ప్రతి దాంట్లోనూ సానుకూలతలను వెతుక్కుంటానని అన్నాడు. ఇటీవల ఇంగ్లాండ్ పర్యటించేందుకు ఎంపిక చేసిన భారత పరిమిత ఓవర్ల తుది జట్లలో చోటు కోల్పోయాడు.
ఇలా జరగడం వల్ల ఇంగ్లాండ్తో ఆగస్టు 1నుంచి మొదలయ్యే టెస్టు సిరీస్కు సన్నద్ధం కావడానికి తనకు ఎక్కువ సమయం లభిస్తుందని రహానె చెప్పాడు. 'సన్నద్ధం కావడానికి సమయం దొరకడం ముఖ్యం. స్పష్టత కూడా ప్రధానమే. ఇంగ్లాండ్లో నేను టెస్టులు మాత్రమే ఆడబోతున్నా. వన్డే జట్టులో లేకపోవడం వల్ల అఫ్గానిస్థాన్తో టెస్టుకు, ఇంగ్లాండ్తో సిరీస్కు సిద్ధమయ్యేందుకు నాకు చాలా సమయం దొరుకుతుంది' అని రహానె పేర్కొన్నాడు.
వన్డే జట్టులో స్థానం కోల్పోయినందుకు తనకు ఏమాత్రం అసహనంగా లేదని స్పష్టం చేశాడు. 'నాలో ఏమాత్రం అసహనం లేదు. నిజానికి నాకిది ప్రేరణగా పనిచేస్తోంది. నాకిప్పుడు వన్డే జట్టులో పునరాగమనం చేయాలనే పట్టుదల పెరిగింది. ఇప్పుడు మాత్రం నా దృష్టంతా టెస్ట్ క్రికెట్పైనే' అని రహానె తెలిపాడు.
'ఇప్పటికీ నాపై నాకు నమ్మకం ఉంది. ఎప్పుడు అవకాశం దొరికినా వన్డే క్రికెట్లో మెరుగైన ప్రదర్శన చేశా. వెస్టిండీస్లో 'మ్యాన్ ఆఫ్ ద సిరీస్' అవార్డు అందుకన్నా. ఆస్ట్రేలియాపై మెరుగ్గా రాణించా. దక్షిణాఫ్రికాలోనూ నాలుగో స్థానంలో రాణించా. నేను పుంజుకోడానికి కాస్త సమయం చాలు. తిరిగి వన్డే జట్టులోకి వస్తానని, దేశం తరఫున గొప్పగా రాణిస్తానని ఇప్పటికీ నమ్ముతున్నా' అని వివరించాడు.