హైదరాబాద్: అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) నుంచి రావాల్సిన వాటాల్లో ఏ మాత్రం రాజీపడేదే లేదని బీసీసీఐ స్పష్టం చేసింది. వచ్చే ఆదాయాన్ని దృష్టిలో ఉంచుకొనే ఖర్చులు నిర్ణయించుకున్నామని రావాల్సిన దానిలో ఏ మాత్రం తగ్గించినా ఉపేక్షించేదే లేదని హెచ్చరించింది. ఐసీసీ స్ట్రేటజిక్ వర్కింగ్ గ్రూప్(ఎస్డబ్ల్యూజీ), కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్(సీఓఏ), బీసీసీఐలు ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ ఎదుగుదల గురించి చర్చించారు.
సమావేశం అనంతరం బీసీసీఐ అధికార ప్రతినిధి మాట్లాడుతూ.. లోధా రికమండేషన్ల అనంతరం బీసీసీఐలోకి కొత్త సభ్యత్వాలు పుట్టుకొస్తున్నాయి. దీంతో నార్త్ ఈస్టరన్ రాష్ట్రాల నుంచి బీసీసీఐలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. మరో పక్క మహిళా క్రికెట్కు బీసీసీఐ పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెడుతోంది. అలాంటి సమయంలో మాకు రావాల్సిన నిధులను తగ్గిస్తే మాత్రం ఊరుకునేది లేదని స్పష్టం చేశారు.
'ఇలా ఆలోచిస్తే ప్రతి క్రికెట్ బోర్డుకు ఇలాంటి అవసరాలే ఉంటాయని తెలుసు. అలాగని ఉపేక్షిస్తే దేశీయ క్రికెట్లోనూ ఎదగాలనే ఆకాంక్షతో చేస్తున్న పనులన్నీ ఆగిపోతాయి. దినదినాభివృద్ది జరుగుతోన్న బీసీసీఐకి నిధులు ఇంకా సరిపోవని భావిస్తున్నాం'అని బీసీసీఐ అధికార ప్రతినిధి మాట్లాడారు.
ఈ విషయంపై ఐసీసీ అధికార ప్రతినిధి డేవ్ రిచర్డ్సన్ మాట్లాడుతూ.. భారత్ నుంచి ఐసీసీకి వస్తోన్న నిధులే ఐసీసీ బలం, బలహీనతలు. భౌగోళికంగా ఎదిగేందుకు ఇండియన్ క్రికెట్ ఎంతగానో సహకరిస్తోంది. ఐసీసీ దృష్టిలో ఇది బలహీనత కాకూడదని భావిస్తున్నాం. మిగిలిన దేశాలు ఈ విషయం గమనించి భారత్ను ప్రత్యేకంగా భావించాలని ఆశిస్తున్నామని ముగించాడు.