విదేశాల్లో ఐపీఎల్ 2020
విదేశాల్లో అయినా ఐపీఎల్ 2020 నిర్వహించాలని బీసీసీఐ ఆలోచిస్తున్నట్లు బోర్డు అధికారి ఒకరు తాజాగా వెల్లడించారు. 'ఐపీఎల్ 2002ని నిర్వహించేందుకే చూస్తున్నాం. బోర్డు ప్రతి విషయాన్ని పరిశీలిస్తుంది. ఒకవేళ చివరిగా విదేశాల్లో నిర్వహించాల్సి వస్తే.. అదీ చేస్తాం. విదేశాల్లో లీగ్ నిర్వహించడం ఇదే మొదటిసారి కాదు. కానీ భారత్లో లీగ్ నిర్వహించడానికే అత్యధిక ప్రాధాన్యత ఇస్తాం' అని సదరు అధికారి తెలిపారు. 2009, 2014 రెండు ఐపీఎల్ సీజన్లు విదేశాల్లోనే జరిగాయి. 2009 సీజన్ దక్షిణాఫ్రికాలో జరగగా.. 2014 సీజన్లో తొలి 20 మ్యాచ్లు యూఏఈలో జరిగాయి.
ప్రపంచకప్ స్పష్టత కోసం ఎదురుచూస్తున్నాం
ఈ ఏడాది అక్టోబర్ 18 నుంచి నవంబర్ 15వ తేదీ వరకు ఆస్ట్రేలియా వేదికగా జరగాల్సిన టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ అయి ఉన్న విషయం తెలిసిందే. అయితే కరోనా వైరస్ కారణంగా ఆ టోర్నీని ఐసీసీ వాయిదా వేయాలని యోచిస్తోంది. ఈ నేపథ్యంలో టీ20 ప్రపంచకప్ గురించి స్పష్టత వచ్చిన తర్వాత తుది నిర్ణయాన్ని తీసుకుంటామని సదరు అధికారి చెప్పారు. 'ఐసీసీ నుంచి టీ20 ప్రపంచకప్ గురించి స్పష్టత కోసం ఎదురుచూస్తున్నాం. దాని తర్వాతే ఐపీఎల్ 2020పై నిర్ణయం తీసుకుంటాం. ప్రస్తుతం దీనిపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు' అని ఆయన పేర్కొన్నారు.
న్యూజిలాండ్లో జరగొచ్చు
న్యూజిలాండ్లో కరోనా ప్రభావం తక్కువగా ఉండడం సహా 12రోజులుగా ఒక్కకేసు కూడా నమోదు కాలేదు. దీంతో కొత్త కేసులు రాకపోతే వచ్చే వారం నుంచి ప్రజలు గుమికూడేందుకు కూడా అనుమతిస్తామని ఆ దేశ ప్రధాని జెసిండా అడెర్న్ ఇటీవల చెప్పారు. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియాకు దగ్గరలో ఉన్న న్యూజిలాండ్లో టోర్నీ జరుగొచ్చని ఆసీస్ మాజీ క్రికెటర్ డీన్ జోన్స్ అభిప్రాయపడ్డాడు. 'వచ్చే వారం అలెర్ట్ లెవెల్-1కు న్యూజిలాండ్ వెళ్లొచ్చని ప్రధాని చెప్పారు. భౌతిక దూరం నిబంధనలతో పాటు జన సమూహాలపై విధించిన నిషేధం కూడా తొలగిపోతుందన్నారు. అక్కడ టీ20 ప్రపంచకప్ జరుగొచ్చు' అని జోన్స్ ట్వీట్ చేశాడు.
అనుకూల వాతావరణం ఉంటే భారత్లోనే
తాజాగా లాక్డౌన్లో వెసులుబాటు కల్పించినప్పటికీ క్రికెట్ మ్యాచ్ల ఆరంభంపై స్పష్టత లేదని తాజాగా బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అన్నాడు. 'రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో అంచనా వేయలేని పరిస్థితి ఉంది. అన్ని అంశాలనూ పరిశీలిస్తున్నాం. ఒకవేళ ఐపీఎల్ జరిగినా ఎక్కడ జరుగుతుందో కచ్చితంగా చెప్పలేం. అనుకూల వాతావరణం ఉంటే భారత్లోనే జరుగుతుంది. అయితే ఇప్పుడేం చెప్పినా తొందరపాటే అవుతుంది. ఎందుకంటే ఐపీఎల్ షెడ్యూల్ గురించి మేమింకా చర్చించలేదు' అని గంగూలీ చెప్పాడు.