పాత కాలపు అప్రోచ్తో..
వచ్చే ఏడాది భారత్ వేదికగా జరగనున్న వన్డే ప్రపంచకప్ ప్రణాళికల్లో శిఖర్ ధావన్ను కొనసాగించాలా? పక్కనపెట్టాలా? అనే సందిగ్దతను ఇషన్ కిషన్ తీసుకొచ్చాడు. ధావన్ కంటే తాను ఎంతో బెటరనే విషయాన్ని చాటి చెప్పాడు. ఈ యువ ఓపెనర్ కారణంగా 36 ఏళ్ల గబ్బర్ కెరీర్ ప్రశ్నార్థకంగా మారింది. గరిష్టంగా మరో 6 మ్యాచ్లతో అతని భవితవ్యం తేలనుంది. చివరి 9 వన్డేల్లో ధావన్ 8 మ్యాచ్ల్లో ఇబ్బంది పడ్డాడు. పాత కాలపు అప్రోచ్తో ఆడుతూ జట్టుకు తీవ్ర నష్టం చేస్తున్నాడు. పవర్ ప్లేలో వేగంగా ఆడలేక ఇబ్బంది పడుతున్నాడు. మరోవైపు ఇషాన్ కిషన్, శుభ్మన్ గిల్ ఇన్నోవేటివ్ షాట్స్తో అదరగొడుతున్నారు.
ద్రవిడ్, రోహిత్ సూచనలతో..
ఈ క్రమంలోనే బీసీసీఐ నిర్వహించే రివ్యూ మీటింగ్లో శిఖర్ ధావన్ భవితవ్యంపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. రాహుల్ ద్రవిడ్, ఎన్సీఏ హెడ్ వీవీఎస్ లక్ష్మణ్లతో వన్డే ప్రపంచకప్ రోడ్ మ్యాచ్ సిద్దం చేయనున్నారు. అయితే ధావన్ భవితవ్యంపై వచ్చే ఏడాదే కొత్త సెలెక్షన్ కమిటీ నిర్ణయం తీసుకుంటుందని ఓ బీసీసీఐ అధికారి తెలిపాడు.'శిఖర్ ధావన్ భవితవ్యంపై కొత్త సెలెక్షన్ కమిటీ నియమాకం తర్వాతే నిర్ణయం తీసుకుంటారు. హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ శర్మల అభిప్రాయాలను ఏ మాత్రం విస్మరించరు. వారి సూచనలతోనే సెలెక్షన్ కమిటీ నిర్ణయం ఉంటుంది'అని సదరు అధికారి పీటీఐకి తెలిపారు.
స్ట్రైక్రేట్ ఘోరం..
ఇక శిఖర్ ధావన్తో వచ్చిన ప్రధాన సమస్య అతని స్ట్రైక్రేట్. 2019 వరల్డ్ కప్ నుంచి అతని స్ట్రైక్రేట్ 100 ప్లస్ నుంచి 75కి పడిపోయింది. ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీతో అతని అప్రోచ్ టీమిండియా మేనేజ్మెంట్ను ఆకట్టుకుంది. మరోవైపు శుభ్ మన్ గిల్ సైతం నిలకడగా రాణిస్తుండటంతో శిఖర్ ధావన్ కొనసాగించడం అవసరం లేదనే అభిప్రాయం కలుగుతోంది. అయితే వచ్చే ఏడాది మార్చి వరకు టీమిండియాకు వరుస సిరీస్లు ఉన్నాయి. ఈ బిజీ షెడ్యూల్ నేపథ్యంలో టీమిండియా వేర్వేరు జట్లతో ఆటగాళ్ల వర్క్ లోడ్ సమన్వయం చేసే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే శిఖర్ ధావన్కు మరో 6 మ్యాచ్లు అవకాశం దక్కవచ్చు. ఈ 6 మ్యాచ్ల్లో అతను ఆడేదాన్ని బట్టే అతని భవితవ్యం ఆధారపడి ఉంది.