ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 14వ సీజన్లో కొందరు ఆటగాళ్లు కరోనా మహమ్మారి బారిన పడటంతో భారత క్రికెట్ మండలి (బీసీసీఐ) మంగళవారం ఈ సీజన్ను అర్ధాంతరంగా నిరవధిక వాయిదా వేసిన సంగతి తెలిసిందే. కరోనా కారణంగా ఐపీఎల్ 14వ సీజన్ నిరవధికంగా వాయిదా పడటంతో బీసీసీఐ భారీ నష్టాల్ని చవిచూడనుంది. దాదాపు రూ.2,000 కోట్ల నుంచి 2,500 కోట్ల మధ్య నష్టాల్ని చవిచేసే అవకాశం ఉందని ఓ సీనియర్ బీసీసీఐ అధికారి పేర్కొన్నారు. సుమారు రూ.2200 కోట్ల మేర కోల్పోనుందని చెప్పుకొచ్చారు. అయితే ఆ మొత్తాన్ని బోర్డే భరిస్తుందని ఆయన తెలిపారు.
IPL 2021: ప్లీజ్ డాడీ.. ఎక్కడికి వెళ్లకుండా డైరెక్ట్గా ఇంటికి వచ్చేయ్! చాలా మిస్సవుతున్నాం!
ప్రతి ఏటా ఐపీఎల్ టీ20 లీగ్ను బీసీసీఐ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా విశేషమైన ఆదరణ ఉంది. దీంతోనే ప్రసారదార్లు (బ్రాడ్కాస్టర్లు), స్పాన్సర్షిప్ల నుంచి బీసీసీఐ భారీ మొత్తంలో ఆదాయం ఆర్జిస్తుంది. ఐపీఎల్ మ్యాచ్లు ప్రసారం చేసేందుకు స్టార్ స్పోర్ట్స్ ఛానెల్ ఐదేళ్ల కాలానికి రూ.16,347 కోట్ల ఒప్పందం కుదుర్చుకుంది. ఈ లెక్కన ఏటా 60 మ్యాచ్లకు రూ.3270 కోట్లు.. ఒక్క మ్యాచ్కు దాదాపు రూ.54.5 కోట్లు వస్తాయి. ఈ సీజన్లో ఇప్పటివరకు 24 రోజుల్లో 29 మ్యాచ్లు జరిగాయి. అందుకు స్టార్ స్పోర్ట్స్ రూ.1580 కోట్లు చెల్లించనుంది.
ఐపీఎల్ 2021 మిగతా మ్యాచ్లు జరగనందున బీసీసీఐకి రూ.1690 కోట్ల మేర నష్టాలు భరించాల్సి రావచ్చు. మరోవైపు టైటిల్ స్పాన్సర్గా ఉన్న ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ 'వివో'.. బీసీసీకి ఏడాదికి రూ.440 కోట్లు చెల్లించనుంది. ఈసారి అందులో సగం కన్నా తక్కువే రానుంది. ఇక అసోసియేట్ స్పాన్సర్లు అన్అకాడమీ, డ్రీమ్11, క్రెడ్, అప్స్టాక్స్, టాటా మోటార్స్ వంటి కంపెనీల నుంచి సైతం బీసీసీఐకి పెద్ద మొత్తంలో నష్టాలు రానున్నాయి. అన్ని కలిపితే సుమారు రూ.2200 కోట్లపైనే ఉంటుందని ఆ బీసీసీఐ అధికారి పేర్కొన్నారు.
సోమవారం కేకేఆర్ ఆటగాళ్లకు కరోనా పాజిటివ్గా తేలగా.. సీఎస్కే జట్టులో సిబ్బందితో పాటు బౌలింగ్ కోచ్కు కరోనా సోకినట్లు తేలింది. తాజాగా ఎస్ఆర్హెచ్ నుంచి వృద్ధిమాన్ సాహా, ఢిల్లీ నుంచి అమిత్ మిశ్రాలు కరోనా బారీన పడడంతో బీసీసీఐ ఐపీఎల్ నిర్వహణపై పునరాలోచించింది. మొదట తాత్కాలికంగా వాయిదా వేయాలని భావించినా.. ఆటగాళ్లకు కరోనా సోకే అవకాశాలు ఎక్కువే ఉండడంతో 14వ సీజన్ను రద్దు చేస్తున్నట్లుగా మంగళవారం నిర్ణయం తీసుకుంది.