8 నిమిషాల్లోనే 2 కిమీ
ఇప్పటివరకు యో-యో ఫిట్నెస్ టెస్టులో ఓ క్రికెటర్ 17.1 పాయింట్లు సాధిస్తే.. సదరు ఆటగాడు పాస్ అని బీసీసీఐ పరిగణించేది. ఇప్పుడు కొత్తగా ఆటగాళ్ల వేగం, సహనానికి పరీక్ష పెట్టేందుకు ఓ టెస్టుని తెరపైకి తీసుకువస్తోంది. అదేంటంటే.. ఓ ఫాస్ట్ బౌలర్ 2 కిమీ దూరాన్ని 8 నిమిషాల 15 సెకన్లలో పూర్తి చేయాలి. అదే ఓ బ్యాట్స్మెన్ అయితే 8 నిమిషాల 30 సెకన్లలో పరుగు పెట్టాలి. బ్యాట్స్మెన్కు 15 సెకన్లు అదనపు సమయం ఇచ్చింది. ఏడాదిలో మూడు సార్లు ఈ టెస్టుని ఆటగాళ్లు పూర్తి చేయాల్సి ఉంటుందట.
గంగూలీతో చర్చలు
కొత్త టెస్ట్ కోసం ప్రస్తుతం ఫిబ్రవరి, జూన్, సెప్టెంబరు నెలలు ప్రతిపాదనలో ఉండగా.. సెప్టెంబరుకి బదులు ఆగస్టులో నిర్వహించడం పైనా చర్చలు నడుస్తున్నట్లు సమాచారం తెలుస్తోంది. కొత్త ఫిట్నెస్ టెస్టు ప్రతిపాదనపై బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ.. బోర్డు సభ్యులతో చర్చలు జరుపుతున్నాడని సమాచారం. బీసీసీఐ కాంట్రాక్ట్ ఆటగాళ్లు మరియు భారత జట్టులో చోటు కోసం పోటీ పడుతున్న వారు ఈ టెస్ట్ క్లియర్ చేయాల్సి ఉంటుంది. ఇక గాయపడిన ఆటగాడు ఫిట్నెస్ సాధించిన తర్వాత.. మళ్లీ జట్టులోకి వచ్చే ముందు ఈ యో-యో టెస్టులో పాసవడం తప్పనిసరి.
ఫిట్నెస్ ప్రమాణాలను నవీకరిస్తూనే ఉంటాం
'టీమిండియా ఆటగాళ్ల ఫిట్నెస్ను తదుపరి స్థాయికి తీసుకెళ్లడంలో ప్రస్తుత యో-యో టెస్ట్ కీలక పాత్ర పోషించిందని బీసీసీఐ బోర్డు భావించింది. ఇప్పుడు మన ఆటగాళ్ల ఫిట్నెస్ స్థాయిని మరో స్థాయికి తీసుకెళ్లడంపై దృష్టి సారించాం. టైమ్ ట్రయల్ వ్యాయామం మరింత మెరుగైన ఫిట్నెస్ను సాదించేందుకు సహాయపడుతుందని భావిస్తున్నాం. బోర్డు ప్రతి సంవత్సరం ఫిట్నెస్ ప్రమాణాలను నవీకరిస్తూనే ఉంటుంది' అని బీసీసీఐ అధికారి ఒకరు ఇండియన్ ఎక్స్ప్రెస్తో అన్నారు.
సగం మందికి సిక్స్ ప్యాక్
యో-యో టెస్టు వచ్చిన తర్వాత భారత క్రికెటర్ల ఫిట్నెస్ ఎంతగానో మెరుగైంది.ఇప్పుడు జట్టులోని సగం మంది ఆటగాళ్లు సిక్స్ ప్యాక్తో ఉన్నారు. విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా, హార్దిక్ పాండ్యా, శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, మనీశ్ పాండే, జస్ప్రీత్ బుమ్రా, ఉమేష్ యాదవ్, నవదీప్ సైనీలు సిక్స్ ప్యాక్ కలిగి ఉన్నారు. వీరంతా అలవోకగా యో-యో ఫిట్నెస్ టెస్టులో పాసవుతారు. ఇక రోహిత్ శర్మ, రిషబ్ పంత్ అధిక బరువుతో విమర్శలు ఎదుర్కొన్నారు. కొందరు తరచూ గాయపడుతున్నారు. అందుకే బీసీసీఐ కొత్త టెస్టును తీసుకువస్తోంది.
టీమిండియా సాధించిన చరిత్రాత్మక విజయాన్ని స్ఫూర్తిగా పొందండి: మోదీ