సంజయ్ మంజ్రేకర్కు షాక్.. ఐపీఎల్ 2020లో దక్కని చోటు!!

ముంబై: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) టీమిండియా మాజీ క్రికెటర్, ప్రముఖ వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్కు భారీ షాక్ ఇచ్చింది. సెప్టెంబర్ 19న ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 కోసం ఎంపిక చేసిన కామెంటేటర్ ప్యానెల్లో బీసీసీఐ అతనికి చోటివ్వలేదు. దీంతో యూఏఈ వేదికగా జరగనున్న కాష్ రిష్ లీగ్లో పాల్గొనే అవకాశాన్ని మంజ్రేకర్ కోల్పోయాడు. మరో రెండు వారాల్లో ఐపీఎల్ ప్రారంభమవనుంది. దుబాయ్, అబుదాబి చెరో 21 మ్యాచ్లకు ఆతిథ్యమివ్వనుండగా, షార్జా 14 మ్యాచ్లకు ఆతిథ్యం ఇవ్వనుంది. కామెంటేటర్లను మూడు బృందాలుగా విభజించి దుబాయ్, అబుదాబిలోని బయో సెక్యూర్ బబుల్లో ఉంచుతారు.

మంజ్రేకర్కు షాక్
ముంబై మిర్రర్లో వచ్చిన ఒక నివేదిక ప్రకారం... ఐపీఎల్ 2020 కోసం ఏడుగురు సభ్యులతో కూడిన భారత వ్యాఖ్యాతల బృందాన్ని బీసీసీఐ ఎంపిక చేసింది. అందులో సంజయ్ మంజ్రేకర్ పేరు లేదు. సునీల్ గవాస్కర్, ఎల్ శివరామకృష్ణన్, మురళీ కార్తీక్, దీప్ దాస్గుప్తా, రోహన్ గవాస్కర్, హర్ష భోగ్లే మరియు అంజుమ్ చోప్రాలు కామెంటేటర్ ప్యానెల్లో చోటు దక్కించుకున్నారు. దాస్గుప్తా, కార్తీక్లు అబుదాబి నుంచి కామెంట్రీ చేస్తారు. మిగిలిన వారు షార్జా, దుబాయ్ నుంచి వ్యాఖ్యానం అందించనున్నారు.

సెప్టెంబర్ 10న యూఏఈకి
మురళీ కార్తీక్, దీప్ దాస్గుప్తాలు ఈ రోజు అబుదాబికి బయలుదేరాల్సి ఉంది. కానీ తాజాగా అబుదాబి అధికారులు 14 రోజుల క్వారంటైన్ సమయాన్ని 7 రోజులకు తగ్గించిన విషయం తెలిసిందే. దీంతో ఈ ఇద్దరు మిగతావారితో కలిసి సెప్టెంబర్ 10న వెళ్లనున్నారు. యూఏఈ చేరుకున్న తర్వాత అందరూ నిబంధలను ప్రకారం 7 రోజులు క్వారంటైన్ సమయంలో ఉంటారు. ఆపై బయో బుడగలోకి ప్రవేశిస్తారు.

వివాదాస్పద పదాలు జోడించడంతో
సంజయ్ మంజ్రేకర్కు మంచి క్రికెట్ పరిజ్ఞానం ఉంది. అంతకుమించి ఇంగ్లీష్ భాషలో గలగలా మాట్లాడుతూ అద్భుతంగా కామెంటరీ చేయగలడు. అయితే ఆ కామెంటరీకి కొన్ని సందర్భాల్లో వివాదాస్పద పదాలు జోడించడంతో.. మంజ్రేకర్ వివాదంలో చిక్కుకున్నాడు. గతంలోనూ ఐపీఎల్ సమయంలో ముంబై ఇండియన్స్ ఆల్రౌండర్ కీరన్ పొలార్డ్ని 'మతిలేని క్రికెటర్' అంటూ సెటైర్ వేశాడు. 2019 వన్డే ప్రపంచకప్లో 'బిట్స్ అండ్ పీసెస్' అంటూ చేసిన వ్యాఖ్యలకు టీమిండియా ఆల్రౌండర్ రవీంద్ర జడేజా తీవ్రంగా బదులిచ్చాడు. ఇక సహచర కామెంటేటర్ హర్షా భోగ్లాని హేళన చేస్తూ మాట్లాడినప్పుడు సోషల్ మీడియాలో పెద్ద దుమారం చెలరేగింది.

నోటి దూల కారణంగా
సంజయ్ మంజ్రేకర్కు ఉన్న నోటి దూల కారణంగా గత మార్చిలో దక్షిణాఫ్రికా సిరీస్ సమయంలో అతనిపై బీసీసీఐ వేటు వేసింది. బీసీసీఐ తనని కామెంట్రీ ప్యానెల్ నుంచి తప్పిండంపై మంజ్రేకర్ క్షమాపణలు కోరాడు. ఇక ఐపీఎల్ 2020కి కామెంట్రీ ఫ్యానల్ని బీసీసీఐ ప్రకటించబోతున్న సమయంలో కూడా తనని తీసుకోవాలని అభ్యర్థిస్తూ బోర్డుకి ఓ లేఖ రాశాడు. అయినా కూడా బీసీసీఐ ఐపీఎల్ 2020 కోసం అతడిని పరిగణలోకి తీసుకోలేదు.
RCB: డిఫెన్స్ చేయడానికి టెస్టు మ్యాచ్ కాదు కోహ్లీ.. ఇది టీ20!!
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications