
న్యూఢిల్లీ: ఆస్ట్రేలియాపై భారత క్రికెట్ జట్టు చారిత్రాత్మక విజయాన్ని ప్రస్తావిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం మనకీబాత్లో ప్రశంసల జల్లు కురిపించాడు. 'ఈ నెలలో క్రికెట్ నుంచి మనకో శుభవార్త వచ్చింది. ఆదిలో ఎన్నో ఒడిదొడుకులు ఎదురైనా భారత జట్టు అద్భుతంగా పుంజుకుంది. ఆస్ట్రేలియాలో టెస్టు సిరీస్ గెలిచింది. మన జట్టు కృషి, సమష్టి పోరాటం స్ఫూర్తిదాయకం' అని మోదీ తెలిపారు.
ఇక ప్రధాని వ్యాఖ్యలపై భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ), టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పందించారు. 'స్పూర్తినిచ్చే ఈ మాటలకు, ప్రశంసలకు ధన్యవాదాలు. భారత త్రివర్ణ పతాకం సగర్వంగా ఎగురుతూ ఉండటానికి సాధ్యమైనంత వరకు పోరాడుతూనే ఉంటాం'అని బీసీసీఐ ట్వీట్ చేసింది. మరోవైపు మోదీ మాటలను కోహ్లీ రీట్వీట్ చేస్తూ జాతీయ జెండాను క్యాప్షన్గా పోస్ట్ చేశాడు. ఇక ఆస్ట్రేలియా పర్యటనలో భారత జట్టు అద్భుత ప్రదర్శనను గుర్తించినందుకు బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ ప్రధాని నరేంద్ర మోదీకి ట్విటర్ వేదికగా ధన్యవాదాలు తెలిపాడు.
తొలి టెస్టులో 36 పరుగులకే పరిమితమై ఘోర పరాజయం, పెటర్నిటీ లీవ్తో విరాట్ కోహ్లీ, గాయాలతో సీనియర్ ఆటగాళ్లంతా జట్టుకు దూరమైన ప్రతికూలతల నడుమ.. భారత్ గొప్పగా పోరాడిన విషయం తెలిసిందే. నాలుగు టెస్టుల సిరీస్ను 2-1తో గెలిచి బోర్డర్-గవాస్కర్ సిరీస్ను కైవసం చేసుకుంది. మెల్బోర్న్లో బౌలర్ల సమష్టి పోరాటం, అజింక్యా రహానే కెప్టెన్ ఇన్నింగ్స్తో విజయం సాధించగా..
సిడ్నీ టెస్టులో రిషభ్ పంత్, రవిచంద్రన్ అశ్విన్, హనుమ విహారి అద్భుత పోరాట పటిమతో మ్యాచ్ డ్రా ముగించింది. ఇక నిర్ణయాత్మక గబ్బా టెస్టులో యువఆటగాళ్లు శుభ్మన్ గిల్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్ సంచలన ప్రదర్శనతో చారిత్రక విజయాన్ని అందుకుంది.