సిడ్నీ: కరోనాతో ఆగిపోయిన ఐపీఎల్ 2021 సీజన్ను యూఏఈ వేదికగా నిర్వహించేందుకు బీసీసీఐ సమాయత్తం అవుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే లీగ్ నిర్వహణపై అధికారిక ప్రకటన చేసిన బోర్డు.. షెడ్యూల్ ఖరారుపై కసరత్తులు చేస్తోంది. అయితే యూఏఈ వేదికగా జరిగే రెండో దశ లీగ్కు విదేశీ ఆటగాళ్లు అందుబాటులో ఉండటంపై నీలినీడలు కమ్ముకున్నాయి. మిగిలిన ఐపీఎల్ మ్యాచ్లకు ఇంగ్లండ్ ప్లేయర్లు అందుబాటులో ఉండరని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ఇప్పటికే ప్రకటించగా.. కఠిన క్వారంటైన్తో విసిగిపోయిన ఆస్ట్రేలియా ఆటగాళ్లలో ఎంత మంది మళ్లీ యూఏఈకి వస్తారో అనేదానిపై అనుమానాలు నెలకొన్నాయి.
ఐపీఎల్ వాయిదా పడిన తర్వాత నుంచి సుమారు 25 రోజులుగా క్వారంటైన్లో గడిపిన ఆస్ట్రేలియా క్రికెటర్లు.. తమ కుటుంబాలతో సోమవారమే కలిశారు. మిగతా విదేశీ క్రికెటర్లు మూడు రోజుల్లోనే సజావుగా తమ దేశాలకు చేరుకున్నా.. ఆస్ట్రేలియా ప్లేయర్లు మాత్రం వారి దేశ కఠిన ఆంక్షల నేపథ్యంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. భారత్ నుంచి విమానాలు నిషేధించడంతో మాల్దీవుల్లో 10 రోజులు గడిపి ఆస్ట్రేలియాలో అడుగుపెట్టారు. అక్కడ మరో 14 రోజులు క్వారంటైన్లో ఉన్నారు. ఈ కఠిన ఆంక్షలతో విసిగిపోయిన స్టార్ పేసర్ కమిన్స్ కొన్నాళ్లపాటు క్రికెట్కు దూరంగా ఉంటున్నట్లు వార్తలు రాగా.. మరికొంత మంది ఆటగాళ్లు కూడా అతని బాటలో నడవనున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు తమ దేశ ఆటగాళ్లు మిగిలిన సీజన్లో ఆడేది లేనిది ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉందని క్రికెట్ ఆస్ట్రేలియా తెలిపింది. 'ఐపీఎల్ సెకండాఫ్ గురించి తర్వాత నిర్ణయం తీసుకుంటాం. ఈ రోజే వారు క్వారంటైన్ పూర్తి చేసుకున్నారు. ప్రస్తుతం ఆటగాళ్లందరూ తమ ఇళ్లకు చేరడమే ముఖ్యం. అనంతరం వెస్టిండీస్ పర్యటనకు సిద్దమవుతాం. గత కొన్ని రోజులుగా వారు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొంత భయాందోళనకు గురయ్యారు. విండీస్ పర్యటనకు రెండు వారాల ముందు అందర్ని ఒక్కదగ్గరికి చేరుస్తాం'అని సీఏ ప్రతినిధి ఒకరు తెలిపారు.
జూలైలో వెస్టిండీస్ పర్యటనకు వెళ్లనున్న ఆసీస్.. ఆ తర్వాత ద్వైపాక్షిక సిరీస్ కోసం బంగ్లాదేశ్ రానుంది. అయితే ఐపీఎల్ మిగతా మ్యాచ్లు జరపాలనుకుంటున్న సెప్టెంబరు-అక్టోబరులో ఆసీస్కు ఎలాంటి సిరీస్లు లేవు. కాబట్టి ఆ దేశ ఆటగాళ్లు.. సీజన్లో ఆడే విషయమై బోర్డు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.